అర్ధమైంది కదా, మేమెక్కడికి వెళుతున్నామో! అదేనండీ Freedom Park!
పేరేంటా అదోలా ఉంది, అనుకుంటున్నారా... వస్తున్నా అక్కడికే వస్తున్నా.. ఒకానొకప్పుడు కేంద్ర కారాగారంగా ఉన్న ప్రదేశాన్ని ఈ మధ్యే ఉద్యానవనంగా మార్చారు. అక్కడికే మా ఈ ప్రయాణం...
మెజెస్టిక్ నుండి మైసూర్ బ్యాంక్ కి వచ్చేదారిలో శేషాద్రి మార్గ అని ఉంది.. ఆ రోడ్డులో మహారాణీ డిగ్రీ కాలేజీ ఎదురుగ్గా ఉన్నదీ ఉద్యానవనం..
పార్కు ప్రధానద్వారం వైపు వెళ్ళబోతుంటే మన జాతీయ చిహ్నం నాలుగు సింహాలు ఠీవిగా కనిపిస్తున్నాయి.. చూడండి ఆ రాజసం!
ఇదిగో ఇక్కడ ఉంది ముఖద్వారం...


లోపలికి వెళ్ళబోతుంటే వివరాలతో మ్యాప్ ప్రక్కనే ఉంది..

ప్రస్తుతానికి ప్రవేశ రుసుము ఏమీ లేదు కానీ, దాని కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ ఇది...
అలా లోపలికి వెళ్ళామా, ఒక తెమ్మెర అలా పలకరించి వెళ్ళింది.. ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే నీటి తుంపరలు పడుతున్నాయి.. వర్షమా ఏంటి అని చూస్తుండగానే ఎదురుగ్గా Water Fountain.. అసలే ఎండలు మండిపోతున్నాయేమో, ఆ నీళ్ళ దగ్గర అలా నించుంటే ఎంత హాయిగా ఉందో...

ఇంకా ఏమేమి విశేషాలున్నాయో చూద్దామని అక్కడి నుండి కదిలాము..
Side ways కూడా వైవిధ్యంగా మలిచారు.. ఇంకొద్ది దూరం లో Amphi Theatre.. అప్పుడే ఏదో ప్రదర్శన మొదలుపెడుతున్నట్లున్నారు, మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు.. తమ గిటార్లు, డ్రమ్స్ సరి చేసుకుంటున్నారు.. ఒకతనేమో ఏదో మాట్లాడుతూ అందరినీ ఆహ్వానిస్తున్నాడు..
సరే ఇంకా చూడాల్సింది చాలా ఉంది, మళ్ళీ వద్దాం ఇక్కడకి అని ముందుకెళ్ళాం.. పిల్లలు ఆడుకోవడానికి ఓ వైపు ప్రత్యేకంగా.. అలా ఇంకో ఫర్లాంగు వెళ్ళగా జైలు బ్యారక్స్... వీటిల్లో అద్వానీ, వాజ్ పేయి లాంటి వాళ్ళు ఎలా ఉన్నారో అనిపించింది.. చెప్పలేదు కదూ, ఎమర్జెన్సీ సమయంలో, జాతీయ నాయకులని చాలా మందిని ఇక్కడే ఖైదు చేశారట.. వారిలో అద్వానీ కూడా ఒకరు.. తదనంతర కాలంలో ఈ జైలు పార్కు గా మారడం, దాన్ని అద్వానీ తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది.. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగు లో కూడా ప్రస్తావించారు..

ఆ బ్యారక్స్ లో ఒక మనిషి కూడా ఉన్నాడండోయి.. మా తమ్ముడేమో, అదిగో మనిషి ఉన్నాడు.. అదేంటి అలా ఉన్నాడు అని మాట్లాడేస్తుంటే నేనేమో ప్రక్క నుండి, అలా అరవకురా.. ఇక్కడ అందరికీ తెలుగు అర్ధమవుతుంది.. నువ్వు అలా అంటే ఏమనుకుంటారో అని లోపలికి తొంగి చూశా.. చూస్తే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన బొమ్మ..!
కాసేపు అక్కడే ఉండి, కొన్ని భంగిమలు తీసుకుని బయలుదేరాం.. అక్కడక్కడా బెంచీలు, కూర్చోవడానికి వీలుగా చదును చేసిన గడ్డి, తోటివాళ్ళతో పరుగులు తీస్తున్న పిల్లలు, కబుర్లాడుకుంటున్న స్నేహితులు, పత్రికలు తిరగేస్తున్న పెద్దలు.. ఇలా వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఉంది.. మేము కూడా కాసేపు కూర్చుని పిల్లగాలిని పలకరించి, గడ్డిపూలతో ఆటలాడి ఇంకే మిగిలున్నాయో చూసొద్దాం అని కదిలాం..
కొంచెం దూరంలో వాచ్ టవర్.. జైలు వినియోగంలో ఉన్నప్పుడు, ఇక్కడ నుండే పహారా కాస్తుండేవారు..


ఆ ప్రక్కనే ఓ భవనం.. ప్రస్తుతానికి దాంట్లో ఏమీ లేవు కానీ అప్పుడప్పుడూ ఏవైనా ప్రదర్శనలకి ఉపయోగిస్తూంటారట..
ఆ భవనానికెదురుగ్గా జైలు మ్యూజియం.. వివిధ సమయాల్లో ఇక్కడ ఉంచబడిన ప్రముఖులు, వారి వివరాలు.. అలానే జైలుని సందర్సించిన వారి వివరాలు అన్నీ పొందుపరిచారు.
ఇప్పటి వరకూ అసలు విషయం చెప్పనేలేదు.. కారాగారం గా ఉన్న ప్రాంతాన్ని హాయిగొలిపే ఉద్యానవనంగా తీర్చిదిద్దిన ఆర్కిటెక్ట్స్.. Soumitro Ghosh, Nisha Mathew-Ghosh ..జాతీయ స్థాయిలో జరిగిన బిడ్ లో అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఈ థీం పార్క్ రూపొందించారు.. దీనికి గానూ, జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు లభించాయి.. వాటిల్లో ప్రముఖమైనది - Cityscape and Architectural Review Awards (2007) in Dubai..
ఈ ఉద్యానవనం నెలకొల్పడానికి ఉన్న ప్రముఖోద్దేశ్యం - సమావేశాలు, నిరసనలు లాంటివి నిర్వహించడానికి.. అసలే ఇక్కడ రోడ్లు అవీ సరిగ్గా ఉండవు, ఒక గజం స్థలం కూడా ఖాళీగా దొరకదు.. నగరం నడిబొడ్డున పెద్ద సంఖ్యలో సమవేశాలు గట్రా నిర్వహించుకోవడానికి దీన్ని ఏర్పాటు చేశారు...
ఎప్పుడూ మాల్స్, సినిమాలు, షాపింగ్ తప్ప ఏమి లేని బెంగళూరు వాసులకి కాసింత ప్రశాంతత దొరికే ప్రదేశం..