Tuesday, November 20, 2007

రాజకీయమైపోతున్న రాజకీయం

నేను నిజానికి ఏ భ్రష్టు పట్టిన రాజకీయమనో, కుళ్ళిపోయిన రాజకీయమనో, పాడైపోయిన రాజకీయమనో, రాద్దామనుకున్నాను, కానీ ఆ పదాలు వాటిని రాజకీయంతో, పోలుస్తున్నందుకు బాధపడతాయేమో అని రాయలేదు…

ఇప్పుడు అందరూ రాజకీయాలలో, విలువలు తగ్గిపోతున్నాయి, మనము వాటిని కాపాడుకోవాలి అని అంటున్నారు కానీ, అసలు ఇంకా విలువలు మిగిలి ఉన్నాయా అని నాకు సందేహం వస్తోంది… దీనికి ప్రత్యక్ష తార్కాణం “కర్నాటకం”…

సంఖ్యాశాస్త్రం ప్రకారం పేరు మార్చుకోవడం వల్ల ఐతేనేమి, బాబాల చుట్టూ తిరగడం వల్ల ఐతేనేమి, రాజ యోగం ఉండడం వల్ల ఐతేనేమి, యెడ్యూరప్ప గారు తొట్టతొలి భా.జ.పా (దక్షిణాదిన) ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించారు.. కానీ ఏమి లాభం, దేవుడు కరుణించినా, పూజారి వరమివ్వని చందాన, ఎన్ని శాంతులు, ఉపశాంతులు చేసినా, దేవెగౌడ గారు పాపం ఆయన్ని స్థిమితంగా ఆ కుర్చీలో కూర్చోనివ్వలేదు…!


రాజకీయ నాయకులకున్న పదవీ లాలస గురించి తెలియని వారుండరు… 2004లో ఎన్నికలు జరిగినప్పుడు, ఎవరికీ మెజారిటీ సీట్లు రాలేదు.. భా.జ.పా అతి పెద్ద పార్టీ గా అవతరించింది.. కానీ, మతతత్వ పార్టీ లని అందలమెక్కించకూడదనే ఉద్దేశ్యంతో, కాంగ్రెస్స్, జే.డి.స్ జట్టు కట్టినాయి.. అప్పట్లో, కాంగ్రెస్స్ వాళ్ళకి, జే.డి.స్ బయటనుండి మద్దత్తు ఇచ్చినట్లున్నారు(నాకు సరిగ్గా గుర్తు లేదు).. మొదటి 20నెలలూ, వారిద్దరి మధ్య దోస్తీ బానే జరిగినట్లు పైకి కన్పించింది(అప్పుడప్పుడూ దేవెగౌడ బెదిరింపులు తప్పించి).. మరి ఆ తరువాత ఏమనుకున్నారో ఏమో, ఒక ఫైన్ డే, కుమారస్వామి మద్దత్తు ఉపసంహరించుకున్నారు.. అంతే కాకుండా, అప్పటివరకూ మతతత్వ పార్టీ అంటూ ప్రక్కన పెట్టిన, భా.జ.పా తో సంబంధం కలుపుకున్నారు.. అప్పట్లో ఎలాగైనా అధికారాన్ని తాము కొంతైనా అనుభవించాలి అనే ఆశతో, వాళ్ళు కూడా అప్పటివరకు వీళ్ళు తమని అన్న మాటలన్నీ మర్చిపోయి, ఆనందంగా ఒప్పుకున్నారు… అప్పటినుండి, మొన్న సెప్టెంబరు వరకూ కూడా వారు కుక్కిన పేనుల వలె పడి ఉన్నారు… అప్పటికీ మధ్య మధ్యలో, జే.డి.స్ వాళ్ళు, మీకు మేము అధికారం అప్పగిస్తామనుకోవడం మీ మూర్ఖత్వం అని చెవిలో బాకా ఊదినా కానీ, కుమారస్వామి(దేవెగౌడ) మీద ఉన్న అతి నమ్మకంతో, పెద్ద పట్టనట్లు ఉండిపోయారు.. చివరికి ఆ శుభముహుర్తం రానే వచ్చింది.. ఆ రోజు అక్టోబర్3… అప్పటివరకు నేను ఎలాగైనా అధికారం అప్పగిస్తాను అని చెబుతూ వచ్చిన కుమారస్వామి గారు మధ్యాహ్నాని కల్లా క్రొత్త పల్లవి అందుకున్నారు.. తమ మీద భా.జ.పా వాళ్ళు ఏవో కేసులు పెట్ట్టారు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మేము అధికారం అప్పగించము అన్నారు.. అంతే, అప్పటివరకూ బలవంతంగా మద్దత్తు ఇస్తున్న భా.జ.పా వాళ్ళు వెంటనే ఉపసంహరించారు..

ఇక్కడ ఒక విషయం గమనించాలి.. భా.జ.పా కి చెందిన “గాలి జనార్ధన రెడ్డి” జేఎ.డి.స్ వాళ్ళ మీద ఆరోపణలు చేస్త్తున్నరు అనే నెపంతో, వాళ్ళు అధికార మార్పిడి కి ఒప్పుకోలేదు.. అదే వ్యక్తి కి మన రాష్ట్రంలో, ఎన్నో వేల ఎకరాలు కట్టబెట్టారు.. వాళ్ళు పెడుతున్న పరిశ్రమకి కేవలం విమానాశ్రయం నిర్మించుకోవడానికే, నాలుగువేల ఎకరాలు ధారపోశారు మన ప్రభువులు…మరి ఆయనేమో భా.జ.పా కి సంబంధించిన వ్యక్తి, ఈయనేమో కాంగ్రెస్సు వారు.. అంటే, పైకి మాత్రం వేరే పార్టీల వాళ్ళు అని దుమ్మెత్తి పోసుకుంటారు కానీ, అందరూ ఆ తానులో ముక్కలే…!!

సరే మళ్ళీ కర్నాటకానికి వద్దాం… మొత్తానికి ఒక నెల పాటు, అసెంబ్లీ ని సుషుప్తావస్థ లో ఉంచారు.. మళ్ళీ బేరసారాలు మొదలయ్యాయి.. జే.డి.స్ వాళ్ళలో మళ్ళీ ఎన్నికలు వస్తే గెలుస్తామనే నమ్మకం పోయింది.. మిగిలి ఉన్న 20నెలల (కరెక్టుగా చెప్పాలంటే 19నెలల) అధికారాన్ని వదులుకోకూడదని మళ్ళీ భా.జ.పా కి చేరువయ్యారు.. అసలు నిజానికి, ఇది దేవెగౌడ కి ఇష్టం లేదట.. కానీ ఆయన పార్టీకి చెందిన వారు మాత్రం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాకు సంబంధం లేదు, మేము వాళ్ళతో కలిసిపోతాం అని బెదిరించేసరికి ఈయన దారికి వచ్చినట్లు కనిపించాడు.. అయితే ఆయనకి, భా.జ.పా తో కంటే, కాంగ్రెస్సు తో జట్టు కట్టడమే ఇష్టం లాగా ఉంది, అందుకనే ఎందుకనే మంచిది అని తనకి నమ్మకమైన వ్యక్తి ని వాళ్ళతో రాయబారాలు జరపమని చెప్పాడు.. అయితే ఇంతలో, తన పార్టీ సభ్యుల దూకుడు వల్ల, భా.జ.పా వాళ్ళకి మద్దత్తు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.. అయితే మొదట చెప్పినప్పుడు ఎటువంటి షరతులు లేకుండా, ఇవ్వడానికి ఒప్పుకున్నారు.. దాంతో యెడియూరప్ప గారు, అమితానందంతో, ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు.. ఇక అప్పుడు దళపతి(కర్నాటక లో దేవెగౌడ ని అలానే అంటారు) తన మనసులో ని మాటని బయట పెట్టారు..పంచశీల సూత్రాల లాగా, ద్వాదశ నియమాలు పెట్టారు.. అయితే వాటిల్లో, పదింటిని భా.జ.పా వాళ్ళు తిరస్కరించారు.. సరే కుమారస్వామి కూడా దీనికి ఒప్పుకున్నారు.. అయితే మిగిలిన ఆ రెండిటి దగ్గర పీట ముడి పడింది.. ఆ ముడి విప్పే ప్రయత్నంలో అప్ప(యెడియూరప్ప) తన పదవినే పోగొట్టుకోవాల్సి వచ్చింది..


ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత, జే.డి.స్ వాళ్ళు తమని మోసం చేశారు అని భా.జ.పా వాళ్ళు అంటున్నారు కానీ, నేను వాళ్ళ చేతకానితనమని అంటాను.. ఎలా అయితే, తమని స్టాంప్ పేపర్ మీద ఆ నియమాలకి సంతకం పెట్టమంటున్నాడో, వీళ్ళు కూడ మిగిలిన 19నెలలు తమకి ఎటువంటి పరిస్థితుల్లోనూ మద్దత్తు ఉపసంహరించను అని రాసివ్వమని అంటే లెక్క సరిపోయేది.. దానికి దళపతి ఒప్పుకునే వాడు కాదు, అప్పుడు వాళ్ళకి తమ వాణిని ఇంకా సమర్ధవంతంగా వినిపించి ఉండడానికి అవకాశం ఉండేది.. కానీ వాళ్ళు చేజేతులా ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నారు...!

అయితే, ఇక్కడ ఇంత జరుగుతుంటే, దేవెగౌడ గారు ఢిల్లీ కి వెళ్ళారు.. అక్కడ పత్రిక ప్రతినిధులు జరిగిన సంఘటనల మీద, మీ అభిప్రాయం చెప్పండి అంటే, నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను, అక్కడ జరుగుతున్న విషయాల మీద మా పార్టీ వాళ్ళు నాకు విడమరచి చెప్పేవరకూ నేనేమీ చెప్పలేను అని అన్నారు.. అసలు ఈ మాటలు వినడానికే నవ్వోస్తోంది..దగ్గరుండి చేసిందంతా ఆయన, మళ్ళీ నాకేమీ తెలియదు అంటుంటే ఎవరు మాత్రం ఏమి మాట్లాడగలరు…?!

ఇప్పుడు ప్రస్తుతానికి, బంతి కేంద్ర క్యాబినేట్ దగ్గర ఉంది.. వాళ్ళకి దేవెగౌడ తో ఒప్పందం కుదిరితే, మళ్ళీ నాలుగో సంకీర్ణం వస్తుంది, లేకపోతే రాష్ట్రపతి పాలన, తరువాత ఎన్నికలు.. కానీ ఎన్నికల్లో కూడా, ప్రజలు ఎవరికి ఓటు వేయాలి.. భా.జ.పా కి పూర్తి అధికారం రావడం కష్టం.. అలానే, జేఎ.డి.స్ వాళ్ళు అంత పని చేసిన తరువాత, వాళ్ళకి ఓటు వేయ్యాలంటే కొంచెం ఆలోచించచ్చు… కాంగ్రెస్స్ కి వేయాలన్నా కానీ అంత మంచి నాయకులు లేరు వాళ్ళకి.. సో, మళ్ళీ సంకీర్ణం. మళ్ళీ ఈ కుమ్ములాటలు.. చూద్దాం ముందు ముందు ఎన్నెన్ని మలుపులు తిరగబోతుందో ఈ రాజకీయం...

Thursday, November 8, 2007

ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం

ఈ పాట అంటే, మన ప్రియతమ నాయకులకి బాగా ఇష్టం అనుకుంటాను.. అందుకే ఎప్పుడు చూసినా ఇద్దరు నేతలు, కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు...!

స్వతహాగా వైద్యుడు కావడం వలన, రెడ్డి గారు నవ్వడం ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశ్యంతో ఎప్పుడు ఎక్కడ చూసినా, ముఖం చాటంత చేసుకుని నవ్వుతూ కనిపిస్తారు.. అది చూసిన అవతలి పక్షం వారేమో, మమ్మల్ని, మా ఇబ్బందులని చూసి నవ్వుతున్నారు అని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు...

సోషియాలజీ చదవడం వలన, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నందున గంభీరం గా ఉండడం అలవాటు నాయుడి గారికి.. అసలు నాయకుడనే వాడికి గాంభీర్యం ఉంటేనే హుందాతనం వస్తుందని ఆయన అనుకుంటూ ఉంటారు.. ఇది చూసిన అవతలి వారేమో, ఆ మమ్మల్ని చూడగానే మొహం మాడ్చుకుంటాడు, మేము బాగు పడిపోతున్నామని ఓర్వలేకపోతున్నాడు అని వాళ్ళు అనుకుంటారు...

ఇలా మాటలు ఏమీ మాట్లాడుకోకముందు నుండే ఒకరి పొడ ఇంకొకరికి పడదు... సరే ఏ సమావేశంలోనో, కలిశారే అనుకుందాం, ఇక మాటల తూటాలు పేల్చుకోవడానికి ఇరు పక్షాలు సిధ్ధంగా ఉంటాయి...

ఎంతైనా ఏలికలు ముందు మాట్లాడడం మొదలు పెడతారు కదా.. మన సంప్రదాయం ప్రకారం, మాట్లాడడం ఆరంభించే ముందు నమస్కారం అనడం ఆనవాయితీ.. ప్రభువులు కూడా ఇప్పుడు అదే అన్నారు...

అయితే విపక్షీయులు ఎంతసేపు వీళ్ళ మీద ఎలా దాడి చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, దాని వల్ల ఎదుటి వారి మాటలు సరిగ్గా వినరు.. చివరిలో వింటారు.. ఆ 'నమస్కారం' లో, రెండో పదం (కారం) వినిపిస్తుంది.. ఇక అంతే, మమ్మల్ని చూడగానే ఈయన కారాలు మిరియాలు నూరుతున్నాడు అని అపోహపడతారు.. దాంతో గంభీరంగా ఉన్న వదనం కాస్తా కందగడ్డలాగా అయిపోతుంది...

ఇక ఇప్పుడు మాట్లాడడం వీళ్ళ వంతు.. అసలే మొహం మొటమొట లాడిస్తూ ఉంటాడు, ఇప్పుడు ఇంకా మాడిపోయింది అని వాళ్ళలో వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు.. ఆయనేమో మీరు దేవుడి పాలన, దేవుడి పాలన అంటారు.. ఎంత దేవుడి పాలన అయినా యుగం అంతం కావల్సిందే, మేము అప్పుడు చూస్తాం మీ సంగతి అని అంటాడు.. వీళ్ళ నవ్వులలో, వీళ్ళకి కూడా సగమే వినిపిస్తుంది.. "మీ అంతం చూస్తాం" అని...

ఇక అంతే,సమావేశం కాస్త రణరంగం గా మారిపోతుంది.. ఇరు వైపుల బట్టతల నాయకులు రంగంలో కి దూకుతారు.. అధికార పక్ష నాయకుడికి మొత్తం ఊడిపోతే, విపక్షీయునికి రెండే రెండు వెంట్రుకలు ఉంటాయి (మరి అంతే కదా ఎంతైనా పాలక వర్గం వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువ కదా).. సరే ఇద్దరూ కలిసి అగ్నికి ఆజ్యం పోస్తారు...

ఇక అక్కడ తిట్టుకోవడం అయిపోగానే, బయటకు వస్తారు.. మీడియా వాళ్ళు చుట్టుముడతారు... వీళ్ళ తిట్లన్నీ మంచి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో విశదంగా విపులీకరిస్తారు... మనమేమో పనులన్నే మానుకుని నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంటాము.. శాడిస్ట్ అని కొంతమందిని ప్రత్యేకంగా ముద్ర వేస్తాం కానీ, నిజానికి మనంత శాడిస్టులు ఎవరూ ఉండరు..! లేకపోతే, అలా వాళ్ళు తిట్టుకుంటూ ఉంటే, మనకు ఎంత ఆనందమో, టి.వి వాడు వీళ్ళిద్దరిలో బూతులు ఎవరు బాగా మాట్లాడారు అని అడిగీ అడగగానే పోటీలు పడి SMSలు చేసేస్తాం.. Pogo, Jetixల కంటే ఇదే మంచి కామెడీగా ఉంటుంది అని పిల్లలని కూడా ఇవే చూడమని ప్రోత్సహిస్తాం.. అసలు ఏది ఎటు పోతుందో ఏమీ అర్ధం కావట్లేదు.. నేను మాత్రం "ఏ తీరుగ నను దయచూసెదవో ఇన వంశోత్తమ రామా" అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను...