Friday, September 28, 2007

రామునికి సీత ఏమవుతుంది…?

              మనం ఇప్పుడు లావోస్ రామాయణంలోని కధలని తెలుసుకుందాం…

               లావోస్ దేశంలో, రకరకాల రామాయణ గాధలు ప్రాచుర్యంలో ఉన్నాయి.. అయితే వాటిల్లో ప్రసిధ్ధమైనవి “దశవిలాసాల రాజు నిదానం ”.. “రామ జాతకం" కధలు..

దశవిలాసాల రాజు నిదానం:

               దశవిలాసాల రాజు, జంబూద్వీపాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు.. అతనికి నలుగురు భార్యలు…. ఒక్కొక్క భార్య వలన, ఒక్కో కుమారుడు కలిగాడు.. వాళ్ళు “రాముడు”, “లోమనుడు”, “భరతుడు”, “శతృసంహారకుడు”..  వాల్మీకి రామాయణంలో లానే, దీంట్లో కూడా రాజుకి మూడవ భార్య అంటే తగని ప్రీతి.. ఒకసారి ఆనంద సమయంలో ఉన్నప్పుడు ఆమెకి ఒక వరాన్ని ఇస్తాడు.. దానికి ఆమె, తరువాత కోరుకుంటాను అని అంటుంది..

               పిల్లలందరూ, రాజగురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు.. అందరిలోకీ రాముడు చాలా తెలివిగలవాడు.. అతనికి చాలా శక్తులు ఉండేవి.. శతృవు అదృశ్య రూపంలో ఉన్నా, శబ్దాన్ని గ్రహించి వారితో యుధ్ధం చేసేవాడు..

                 వయోభారం వలన, మహారాజు ఆరోగ్యం క్షీణిస్తుంది.. దాంతో ఆయన, రాముడిని యువరాజు గా పట్టాభిషిక్తుడిని చేస్తాడు.. అయితే అది మూడవ భార్యకి నచ్చదు.. రాజుని తనకి ఇచ్చిన వరం నిలుపుకోమని చెబుతుంది.. తన కొడుకైన భరతుడికి పట్టం కట్టి, రాముడిని వనవాసం చేయమని చెబుతుంది.. తండ్రి మాట కోసం రాముడు అరణ్యాలకి వెళ్ళడానికి సిధ్ధపడతాడు.. అయితే లోమనుడు అందుకు ఒప్పుకోడు… రాణికి వ్యతిరేకంగా తిరగబడమని చెబుతాడు అన్నగారికి.. అందుకు రాముడు ససేమీరా అంటాడు.. పితృవాక్య పరిపాలన ఆవశ్యకతని తెలియజేస్తాడు.. వనవాసానికి బయలుదేరతాడు..

                రాజ్యంలో ఇన్ని మార్పులు జరుగుతున్న సమయంలో, భరతుడు అక్కడ ఉండడు.. తిరిగి రాజ్యానికి చేరుకోగానే, జరిగిన సంగతులన్నీ తెలుసుకుంటాడు.. అదే సమయంలో, మంచం పట్టి ఉన్న తండ్రి కాలం చేస్తాడు.. దీంతో హతాశుడైన భరతుడు, ఎలా ఐనా అన్నగారిని తిరిగి తీసుకురావాలని అరణ్యానికి వెళతాడు.. అయితే రాముడు దీనికి ఒప్పుకోడు.. ఇక అన్నగారి ఆజ్ఞ మేరకు, ఆయన పాదుకలు(తోలు చెప్పులు) తీసుకుని రాజ్యానికి వెళ్ళి రాముడి ప్రతినిధుడిగా పరిపాలిస్తూ ఉంటాడు.. వనవాసంలో ఉన్నా, ఎల్లప్పుడూ రాముడికి లేఖలు, సందేశాలు పంపిస్తూ ఉండేవాడు.. రాముడు కూడా వాటికి ప్రత్యుత్తరాలు ఇస్తూ ఉండేవాడు.. చివరికి ఒక శుభముహుర్తాన, రాముడి వనవాసం పూర్తి అవుతుంది.. రాజ్యానికి తిరిగి వచ్చి అధికారాన్ని చేపడతాడు.. ఆయన పరిపాలనలో, సకాలంలో వర్షాలు పడేవి.. ప్రజలకి సంవత్సరానికి మూడు పంటలు పండేవి.. ఇలా ప్రజారంజకంగా పరిపాలించాడు..

             ఇదీ క్లుప్తంగా దశవిలాసాల రాజు నిదానం కధ…

             దీంట్లో మనకి సీత కానీ, రావణుడు కానీ, ఎక్కడా కనిపించరు.. అసలు వాళ్ళ ఊసే లేదు.. కేవలం రాముడి వనవాసం, తిరిగి రావడం మాత్రమే కనిపిస్తుంది..

             సరే ఇప్పుడు “రామ జాతకం” చూద్దాం..

రామ జాతకం:

             ఇంద్రప్రస్థ రాజ్యంలో, దశరధుడు, విరులహుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు… ఇద్దరిలో, దశరధుడు బలహీనుడు.. దాంతో, విరులహుడు రాజ్యం మొత్తాన్ని ఆక్రమించుకుని దశరధుడిని గెంటివేస్తాడు.. అతను అడవులకి వెళ్ళిపోతాడు.. అక్కడే ఒక రాజ్యాన్ని నిర్మించుకుని జీవిస్తూ ఉంటాడు..ఆ నగరం పేరు చంద్రపురి..

             దశరధుడికి ఒక కుమార్తె… ఆమె పేరు “నంగ్ చంద్ర”… అయితే ఆమెని రావణుడు ఎత్తుకుపోతాడు..

               ఇక్కడ రావణుడి గురించి తెలుసుకుందాం.. ఇతను మరెవరో కాదు దశరధుడి తమ్ముడైన విరులహుడి కుమారుడు.. అయితే తండ్రీ కొడుకులిద్దరికీ పొసగక, ఆయన తన కుమారుడిని రాజ్య బహిష్కారం చేస్తాడు.. రావణుడు లంకలో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు… ఒకసారి ఇంద్రుడి ఆహ్వానం మీద అమరలోకానికి వెళతాడు.. అక్కడ ఉన్న దేవకన్య ని చూసి మనసు చలిస్తుంది.. దానితో ఆమెని బలాత్కరిస్తాడు.. తరువాత తిరిగి తన రాజ్యానికి వస్తాడు..

              అక్కడ దేవలోకంలో, ఆ అప్సరస, తనకి జరిగిన అవమానానికి ప్రతీకారంగా, రావణుడిని సంహరించడానికి ఘోరమైన తపస్సు చేస్తుంది.. వర ప్రభావం వలన, రావణుడికి కుమార్తె గా జన్మిస్తుంది.. అయితే జ్యోతిష్యుల వలన, ఆమె వల్ల తన ప్రాణానికే ముప్పు అని తెలుసుకున్న రావణుడు, ఆమెని నదిలో విసిరివేస్తాడు.. అలా నదిలో కొట్టుకుపోతున్న ఆమెని, ఒక ముని రక్షించి.. ఆమెకి సీత అని నామకరణం చేసి పెంచుతూ ఉంటాడు…

              ఇప్పుడు ఈ రావణుడే దశరధుడి కుమార్తె ని అపహరిస్తాడు.. అయితే రావణుడి ఎదిరించడానికి ఆయన శక్తి సరిపోకపోవడంతో, అతన్ని మట్టుబెట్టగల కుమారుని కోసం తపస్సు చేస్తాడు.. భగవంతుని అనుగ్రహం వలన అతనికి “ప్రలమ్” అనే పుత్రుడు జన్మిస్తాడు..

             ప్రలమ్ పెరిగి పెద్దవాడవుతాడు.. అదే సమయంలో సీత అందచందాలు దేశమంతటా వ్యాపిస్తాయి.. ఆమెకి స్వయంవరం ప్రకటిస్తారు.. ప్రలమ్ తో పాటు రావణుడు కూడా దానికి హాజరవుతారు..(రావణుడికి ఆమె తన కుమార్తె అని తెలియదు) అయితే ప్రలమ్ స్వయంవరంలో ధనస్సుని వంచి సీతని చేబడతాడు.. భార్యతో రాజ్యానికి తిరిగి వెళతాడు.. అయితే అదే ఆ సమయంలో, చెల్లిని ఎత్తుకుపోయిన సంగతి తెలుసుకుంటాడు.. దానితో, రావణుడి మీద దండెత్తి తన చెల్లిని విడిపించుకుని తీసుకు వస్తాడు..

            తరువాత, ఒకసారి ప్రలమ్, సీత ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా, అక్కడికి మాయ లేడి వస్తుంది.. దాన్ని వెంబడిస్తూ ప్రలమ్ చాలా దూరం వెళతాడు. అయితే చివరకు అది కనిపించకపోవడంతో, నిరాశగా తిరిగి వస్తాడు.. అయితే ఇక్కడ సీత కనిపించదు…దానితో, సీతని అన్వేషిస్తూ బయలుదేరతాడు… అయితే శాపకారణం వలన, అతనికి కోతి రూపం వస్తుంది..ఆ రూపంలో ఉన్నప్పుడు అతనికి హనుమంతుడు అనే కుమారుడు జన్మిస్తాడు.. శాప విమోచనం కలిగిన తరువాత మళ్ళీ అతను మానవరూపం పొందుతాడు.. అప్పుడు, తన తమ్ముడితోనూ, హనుమంతుడితోనూ కలిసి రావణుడి మీదకి దండెత్తి అతన్ని సంహరించి, సీతతో తిరిగి రాజ్యానికి వస్తాడు…

          ఇదీ అక్కడ ప్రసిధ్ధమైన రామ కధ..

          మనం ఈ కధని పరిశీలిస్తే, ఖోటాన్ రామాయణంలో చెప్పుకున్న కధకి దీనికి దగ్గర సంబంధం కనిపిస్తుంది..

           అక్కడ దశగ్రీవుడు తనకి కలిగిన కుమార్తె ని నీటిలో పారవేస్తాడు, ఇక్కడా అంతే…

           దాంట్లో నందుడి సహాయంతో లంకకి చేరితే, దీంట్లో హనుమంతుడి సహాయంతో వెళతారు..

           రెండిటిలో నూరుకన్నుల లేడి (మాయాలేడి), సీతాపహరణం జరిగినాయి…

ఇక రెంటి మధ్య బేధాలని చూద్దాం..

         అక్కడ దశగ్రీవుడిని క్షమించి వదిలి పెడతారు, కానీ ఇక్కడ సంహరిస్తారు…

         ఇప్పటివరకు చెప్పుకున్న కధల్లో, రాముడు, రావణుడు కేవలం ఒక్కసారి మాత్రమే తలపడతారు.. ఇక్కడ మాత్రం రెండు సార్లు యుధ్ధం జరుగుతుంది..

            ఇలా ఎందుకు జరిగిందో ఒకసారి పరిశీలిద్దాం… మొదటి తరం కధల్లో, ఏకోదరుల మధ్య వివాహం ఉంది.. తరువాత తరం వచ్చేసరికి ఆ ఆచారం లేదు, అయితే అన్నదమ్ములిద్దరూ, ఒకరినే వివాహం చేసుకునే ఆచారం కనబడుతుంది.. ఆ తరువాత తరంలో, అసలు ఇలాంటి ఆచారం కనబడదు.. (ప్రలమ్ ఒక్కడే సీతని వివాహం చేసుకుంటాడు, అతని తమ్ముడు వివాహం చేసుకోడు) అయితే మూల కధ మరీ మార్చకుండా ఉండడానికి, చెల్లెలిని అలాగే ఉంచారు, ఆమెని రావణుడు ఎత్తుకుపోవడాన్ని చూపించారు, అయితే వారి మధ్య వివాహం మాత్రం ప్రస్తావించలేదు…. అంటే కాలానికనుగుణంగా, ఆచార వ్యవహారాలు మారుతూ ఉన్నాయనమాట..

            ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది.. కేవలం ఒక చిన్న వర్ణనతో, సమాజంలో అభివృధ్ధి ఎలా ఉందో చెబుతుంది.. దశరధ జాతకంలో, రాముడు తృణపాదుకలు ధరించాడు.. అంటే గడ్డి చెప్పులు అన్నమాట.. అదే ఈ కధలో ఆయన తోలుచెప్పులు ధరించాడు అంటే చర్మం తో తయారుచేసినవి.. దీన్ని బట్టి ప్రజల స్థాయిలు మారాయి అని గమనించవచ్చు…

           ఈ రామ కధలో భగవంతుడి అనుగ్రహం వలన రాముడు జన్మిస్తాడు.. అదే తరువాత తరువాత, వాల్మీకి రామాయణంలో, పుత్రకామేష్ఠిగా రూపాంతరం చెంది ఉండచ్చు..

          అలానే మనకి ఈ కధలో, దశరధుడికి, ముగ్గురు నలుగురు భార్యలున్నట్లు కానీ, ఆయన ఒక భార్యకి ఇచ్చిన వరం మూలంగా, రాముడిని వనవాసానికి పంపించడం కూడా కనిపించదు.. అందుకే అక్కడ “దశ విలాసాల రాజు నిదానం” కధ కూడా ప్రచారంలో ఉంది..

          అంతే కాకుండా, ఈ కధలో సీత పాతివ్రత్య పరీక్ష కూడా లేదు..

          రాముడి (ప్రలమ్) చెల్లెలి గురించి ప్రస్తావన వచ్చింది కదా.. ఆ ప్రస్తావన కేవలం అక్కడ రామాయణాల్లోనే కాదు, మన ఆంధ్ర దేశంలో వ్రాసిన స్త్రీల రామాయణంలో, బెంగాల్లో వాడుకలో ఉన్న చంద్రావతి కావ్యంలోనూ కనిపిస్తుంది..దాంట్లో ఆమె పేరు శాంత.. వీటి పూర్తి వివరాలు తరువాత తెలుసుకుందాం..

         అవీ లావోస్ రామాయణంలోని విషయాలు, విశేషాలు.. వచ్చేవారం మరిన్ని కధలని తెలుసుకుందాం..

Thursday, September 27, 2007

భగత్ సింగ్

bhagathsingh

 

         భగత్ సింగ్ ఈ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. ఈ రోజు ఆయన 101వ జయంతి సందర్భంగా, ఒక్కసారి ఆయన ధైర్యసాహసాలని గుర్తుచేసుకుందాం…

    భగత్ సింగ్ స్వస్థలం లయాల్పూర్ జిల్లాలోని ఖాత్కర్ కళన్ గ్రామం.. ఆయన తల్లిదండ్రులు విద్యావతి, సర్దార్ కిషన్ సింగ్.. భగత్ సింగ్ పుట్టిన సమయంలో, కిషన్ సింగ్ సోదరులందరూ, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం వలన, వాళ్ళందరిని జైల్లో పేట్టారు.. ఐతే పిల్లాడు పుట్టీ పుట్టగానే, వాళ్ళందరినీ జైలు నుండి విడుదల చేస్తున్నారనే వార్త తెలిసింది.. తమ కుటుంబానికి అదృష్టం వచ్చింది అని భావించి ఆ పిల్లాడికి భగత్ సింగ్ అని నామకరణం చేశారు...

కుటుంబంలో అందరూ, స్వాతంత్ర్య ఉద్యమంలో, చాలా చురుకుగా పాల్గొనే వాళ్ళు కావడంతో చిన్నప్పటినుండే, భగత్ సింగ్ మనసులో బ్రిటీష్ వాళ్ళంటే, వ్యతిరేక భావం కలిగింది.. ఒకసారి వాళ్ళ నాన్న, బాబాయి తో కలిసి, భగత్ సింగ్ అలా బయటకు వెళుతున్నాడు.. ఐతే కొంచెంసేపైన తరువాత భగత్ సింగ్ కనిపించకపోవడం తో, వెనక్కి తిరిగి చూస్తే, అక్కడ మట్టిలో ఒక మొక్క నాటుతూ, భగత్ సింగ్, నాన్న ఈ మొక్క నుండి తుపాకులు వస్తాయి, వాటితో ఆ బ్రిటీష్ వాళ్ళని పారద్రోలచ్చు అని ఆవేశంగా చెప్పాడు.. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు..

ఆయన 12యేళ్ళ వయసులో ఉన్నప్పుడు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది… ఆ సంఘటన ఆయన్ని చాలా ప్రభావితం చేసింది.. ఆ ప్రదేశానికి వెళ్ళి భూమిని ముద్దాడి, అక్కడ రక్తం తో తడిసిన మట్టిని ఇంటికి తీసుకు వచ్చారు.. ఈ ఒక్కటి చాలు ఆయన ఎంత దేశ భక్తుడో చెప్పడానికి…

చిన్నతనంలో, యూరోప్ లో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి ఎక్కువగా చదివేవారు.. వాటి వల్ల ఆయన కమ్యూనిజం వైపు ఆకర్షించబడ్డారు.. ఆ కాలంలో ఉన్న అతి కొద్ది మంది మార్కిసిస్ట్ ల్లో, ఆయన ఒకరు..

భగత్ సింగ్ లాహోరు లోని డి.ఎ.వి. కళాశాలలో చదువుతున్నప్పుడు, అప్పట్లో స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వాళ్ళు పరిచయమయ్యారు.. వాళ్ళలో ముఖ్యులు, “లాలాలజపతి రాయి”, “రాజ్ బిహారి బోస్”.. మహాత్మా గాంధీ గారు 1921లో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు ఇచ్చారు.. దానికి ప్రతిగా, భగత్ సింగ్ అప్పటివరకు తను చదువుతున్న పాఠశాల మానేసి, లాహోరు లోని, నేషనల్ కాలేజీ లో చేరారు..

భగత్ సింగ్ కి గాంధీ అంటే చాలా అభిమానం ఉండేది.. ఆయన ఎప్పటికైనా భారత దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తాడని నమ్ముతూ ఉండేవాడు.. అయితే 1922లో చౌరీ చోరా లొ జరిగిన సంఘటనల వలన, ఆయన సహాయ నిరాకరణొద్యమం ఆపేశారు.. దాంతో ఒక్కసారిగా భగత్ సింగ్ నిస్పృహుడయ్యరు.. అదే సమయంలో, పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళనం వాళ్ళు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో, ఆయన ప్రధమ బహుమతి సాధించారు (ఆ వ్యాసాన్ని ఇక్కడ చదవండి).. అక్కడ పరిచయమయ్యారు భీమ్ సేన్ విద్యాలంకార్(సాహితి సమితి అధ్యక్షులు)..

కళాశాలలో చదువుతున్న సమయంలో, తెల్లవారికి వ్యతిరేకంగా పనిచేసే చాలా విప్లవకారుల సంస్థల్లో చేరారు.. అలాంటి సమయంలో, విద్యాలంకార్ దగ్గర నుండి పిలుపు వచ్చింది.. దాంతో, “హిందుస్థాన్ రెపబ్లికన్ అసోసియేషన్”లో సభ్యులుగా చేరారు.. భగత్ సింగ్ దాంట్లో చేరిన తరువాత దాని పేరు “హిందుస్థాన్ సోషలిస్ట్ రెపబ్లికన్ అసోసియేషన్” గా పేరు మార్చబడింది.. ఆ సంస్థ సభ్యులలో, ప్రముఖమైన వాళ్ళు, “చంద్రశేఖర ఆజాద్”, “యోగేంద్ర శుక్లా”.. ఈ సంస్థ ఏర్పాటుకి ముఖ్య కారణం రష్యాలోని “బోల్ష్ విక్ విప్లవం”..

సంస్థలో చేరిన దగ్గరి నుండి, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలు చేశారు… దాంతో బ్రిటీష్ ప్రభుత్వం వాళ్ళందరినీ తీవ్రవాదులు గా ముద్రవేసింది..

అది ఫిబ్రవరి, 1928వ సంవత్సరం.. సైమన్ కమీషన్ భారతదేశంలో అడుగుపెట్టింది.. ఆ కమీషన్ ముఖ్యోద్దేశ్యం, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద నివేదిక ఇవ్వడం… ఐతే ఆ కమిటీ లో ఒక్క భారతీయుడు కూడా లేడు.. అందుకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. కమిటీ లాహోరులో పర్యటిస్తున్నప్పుడు, లాలాలజపతి రాయ్ దానికి నిరసనగా, ఒక శాంతియుత ప్రదర్శన చేపట్టారు..కానీ పోలీసులు అత్యుత్సాహంతో, దాంట్లో పాల్గొంటున్న వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేశారు.. ఆ దెబ్బలకి లాలలజపతి రాయ్ చనిపోయారు.. ఈ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షైన, భగత్ సింగ్, లజపతి రాయ్ ని చంపిన పోలిస్ అధికారిని చంపుతానని ప్రతిజ్ఞ చేశారు.. తన స్నేహితులైన శివరామ రాజగురు, జై గోపాల్, సుఖదేవ్ థాపర్ తో కలిసి ప్రణాలిక రచించారు..వాళ్ళ పధకం ప్రకారం, జైగోపాల్ ఆ అధికారిని చూసి, భగత్ సింగ్ కి సైగ చేయాలి.. అయితే జైగోపాల్ తప్పిదం వల్ల, అసలు అధికారి బదులు, వేరే వాళ్ళని కాల్చేశాడు భగత్ సింగ్…

పోలీస్ అధికారిని చంపిన తరువాత, భగత్ సింగ్ మీద నిఘా ఎక్కువైంది.. దాంతో, తప్పనిసరి పరిస్థితుల్లో, మారువేషంలో సంచరించ సాగాడు..

దేశమంతా ఎన్నో ఉద్యమాలు జరుగుతుండడంతో, వాటిని అణచి వేయడానికి, బ్రిటీష్ వారు, ఒక కొత్త చట్టం తీసుకు వచ్చారు.. దాని పేరే, “డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్”.. ఐతే ఈ చట్టం, అసెంబ్లీలో, ఒక వోటు తేడా తో వీగిపోయింది.. ఐతే దాన్ని ప్రత్యేక చట్టంగా తీసుకు వచ్చారు.. అందుకు ప్రతిగా, భగత్ సింగ్ వాళ్ళు అసెంబ్లీలో బాంబ్ పెట్టాలని అనుకున్నారు..

ఏప్రిల్ 8, 1929 న భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ కలిసి, అసెంబ్లీలో పెద్దగా "ఇంక్విలాబ్ జిందాబాద్" అని నినాదాలు చేస్తూ బాంబ్ వేశారు.. ఐతే వాళ్ళకి దాన్ని తయారు చేయడంలో అనుభవం లేకపోవడం వలన, అంతే కాక, దాన్ని అక్కడ ఉన్న సభ్యులకి దూరం గా విసిరి వేయడం వలన, ఎవరికీ ఏమి అవలేదు..

బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది.. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది..

కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు.. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. (అంతకుముందు వరకూ ఆయన కేవలం పంజాబ్ ప్రాంత వరకు మాత్రమే పరిమితమయ్యారు)

చివరికి మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు…. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది..

Monday, September 24, 2007

కంప్యూటర్ ఎలా పని చేస్తుంది..?

కంప్యూటర్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే క్రింద ఒకసారి లుక్కేయండి..!





ఇది నాకు వచ్చిన ఫార్వర్డ్ మెయిల్.. అంతకుమందెప్పుడో వచ్చింది.. మళ్ళీ ఇప్పుడు వచ్చింది.. బావుంది కదా అని బ్లాగేశాను……

ఎందరో మహానుభావులు – 4

ఇప్పటివరకు, ఒక ఘనాపాటి గురించి, ఒక విప్లవకారుని గురించి, ఒక దూర్వాసుడి గురించి తెలుసుకున్నాం కదా… ఇప్పుడు ఒక సున్నిత మనస్కుడి గురించి తెలుసుకుందాం..

గుమ్మలూరి వెంకట శాస్త్రి గారు, బొబ్బిలి ఆస్థాన కళాకారులు… అసలు ఈయన సంగీతం నేర్చుకోవడానికి వెనుక ఒక చిత్రమైన నేపధ్యం ఉంది.. ఈయనకి తొమ్మిది సంవత్సరాల వయసప్పుడు వాళ్ళ ఊరిలో ఒక పెళ్ళి జరిగింది.. అప్పట్లో పెళ్ళిళ్ళంటే, ఇప్పట్లా కాంట్రాక్ట్ లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు కదా… ఏ ఇంట్లో పెళ్ళి జరిగినా, ఊరు మొత్తం అక్కడే ఉండేవారు.. తలా ఒక పని చేసేవారు.. అంతే కాక పెళ్ళిళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అయిదు రోజులు నుండి, పదహారు రోజుల వరకూ చేసేవారు.. సరే ఆ రోజు పెళ్ళి.. అందరూ భోజనాలకి కూర్చున్నారు.. వడ్డించేవారంతా అటూ, ఇటూ తిరుగుతూ అందరికి కొసరి కొసరి వడ్డిస్తున్నారు.. ఐతే అక్కడ ఉన్న వాళ్ళందరిలో హడావిడి అంతా మన వెంకట శాస్త్రిగారిదే.. ఇంతకీ అక్కడ ఆయన పనేంటో తెలుసా నేయి వడ్డించడం.. బూరెలు తినేవారికి బూరెంత నేయి వేస్తున్నాడు. అంతే కాదు బూరె తినని వాళ్ళకి బలవంతంగా బూరె పెట్టి మరీ పోస్తున్నాడు నేయి..!

సరే మొత్తానికి భోజనాలయిపోయాయి.. అందరూ తాంబూల సేవనం చేస్తున్నారు..అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్దాయన, ఆ అబ్బాయిని పిలిచి ప్రక్కన కూర్చుండబెట్టుకుని, బాబూ నీ బూరెలూ, నేతితో మా ఆత్మారాముడు ఆనందపడ్డాడు.. అలానే ఒక పాట పాడావంటే మా మనోభిరాముడు కూడా సంతసిస్తాడు అని అంటారు.. దానికి ఆ పిల్లాడు.. “నీల మేఘశ్యామ..” అని బిళహరి రాగంలో పాట ఆరంభిస్తాడు.. అంతే అప్పటివరకూ గొడవ గొడవగా ఉన్న కళ్యాణమండపం కాస్తా సూది వేస్తే వినిపించేంత నిశ్శబ్దం అయిపోయింది.. దొంగ చూపులు చూసుకుంటున్న పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు కూడా పాటలో లీనమైపోయారు.. అప్పటివరకూ ఏడుస్తూ అమ్మని సతాయిస్తున్న పసిబిడ్డ కూడా హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.. ఒక వైపు భుక్తాయాసం, మరొకవైపు వీనుల విందైన పాట, పెద్దవాళ్ళు కూడా తూలుతున్నారు.. పాట అయిపోయింది.. అంతే పాట పాడమని అడిగిన పెద్దమనిషి ఆ పిల్లాడిని తన శిష్యుడిగా ప్రకటించేసి తన వెంట తీసుకుపోయారు.. ఆ పెద్దాయన మరెవరో కాదు “వాసా అప్పయ్య గారు”…

వాసా అప్పయ్య గారి శిక్షణలో గుమ్మలూరి గారు అటు సంగీతంలో, ఇటు వీణా నాదంలో ప్రావీణ్యులైనారు.. గురువు గారికి ఈ శిష్యుడంటే ప్రత్యేకమైన ఇష్టం.. అటు శిష్యుడికీ గురువు గారంటే ఎనలేని గౌరవం, భయభక్తులూనూ… ఎక్కడ పోటీలు జరిగినా, గురు శిష్యులిద్దరూ వెళ్ళి ఎంచక్కా బహుమతులతో తిరిగి వచ్చేవారు.. ఐతే వీళ్ళ సన్నిహిత్యం చూసి కొంతమంది అసూయ పడుతూ ఉండేవారు..

అలవాటు ప్రకారం, గురు శిష్యులిద్దరూ ఒక సంగీత పోటీకి వెళ్ళారు.. ఐతే అక్కడ ఒక ఆవృతంలో (రౌండ్ లో) వెంకట శాస్త్రిగారు “హరి కాంభోజి రాగం” లో పాడాల్సి వచ్చింది.. ఈయనేమో ఆ రాగాన్ని అంత సాధన చేయలేదు.. తాళం ఎలా వేయాలో సందేహం వచ్చింది.. అది చూసి అక్కడున్నవారు, ఇదే అదననుకుని ఏమి నాయనా నోరు మెదపట్లేదు, చేయి కదలట్లేదు అని వేళాకోళం చేయబోగా, అందుకు ప్రక్కనే ఉన్న గురువు గారు అందుకని, అది కాదు “ముందు గరి నిలుపా వెనుక దని వెసులా అని సందేహిస్తున్నాడు” అంతే అని అన్నారు… గురువు గారి మాటలలోని నిగూఢార్ధాన్ని గమనించి “పమగరి రామా నను బ్రోవరా” అని పాడి అందరినీ మెప్పించి పాటతో బాటు, వీణలో కూడ మొదటి బహుమతి కొట్టేశారు.. అదీ వారిరువురి మధ్య ఉన్న అనుబంధం…

మనం పైన గుమ్మలూరి గారు బొబ్బిలి ఆస్థానంలో కళాకారులు అని చెప్పుకున్నాం కదా.. మంచి గాత్రం తో పాటు, నిండైన ఆహార్యం కూడా వారి సొంతం.. అది చూసి మహారాజు గారు, ఆయన్ని భామాకలాపం లో స్త్రీ పాత్ర వేయమన్నారు.. గొంతు తోనే కాదు, నటనతోనూ రాజు గారిని మెప్పించారు.. ఇక అప్పటినుండీ ఎక్కడ భామాకలాపం జరిగిన వెంకట శాస్త్రిగారే వేషం వేయాల్సి వచ్చేది.. ఈ నాటకాల గొడవలో, సంగీత సాధన చేయడానికి సమయం దొరికేది కాదు.. ఇది తట్టుకోలేని ఆయన, గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఇక ఈ వేషాలు అవీ వేయడం నా వల్ల కాదండీ, రాజు గారు ఏమి చేసినా ఇక ఈ వేషం వేయను అని ఏడ్చినంత పని చేశారు.. సంగీతం మీద ఆయనకున్న మక్కువ చూసిన అప్పయ్య గారు, నాయనా బాధపడకు, అయినా రాజాజ్ఞ మనబొంటి వారలము మీరలేము కదా.. నీకు సంగీతం నేర్పించే పూచీ నాది అని ధైర్యం చెప్పి రాజు గారికి తెలియకుండా చీకట్లో రహస్యంగా నేర్పించేవారు..

అలా స్వకార్యమూ, స్వామికార్యమూ నెరవేరుతుండగా, ఒకరోజు మహారాజు దగ్గరనుండి కబురు వచ్చింది.. ఇంతకీ సంగతేంటంటే, అంతఃపురంలో మేజువాణి ఏర్పాటు చేశారు.. దాంట్లో పాడడానికి ఒకరు కావల్సి వచ్చింది.. అందుకని గుమ్మలూరి గారికి కబురంపించారు.. అయితే ఈ విషయం విన్న వెంటనే వెంకట శాస్త్రి గారి కోపం నషాళానికంటింది.. సరస్వతీ పుత్రుడనైన నేను మేజువాణీలో పాడాలా అని.. అంతే ఆవేశంతో, ఆ భటుడికి, వెంకట శాస్త్రి సంగీతం మర్చిపోయాడు ఇంకా అంటే చచ్చిపోయాడు అని చెప్పు అని పంపేశారు.. ఇక అప్పటినుండీ గుమ్మలూరి వెంకట శాస్త్రి గారు వీణ, సంగీతం ఎప్పుడు పాడలేదు.. అంతే మరి కళాకారులు అంత సున్నితమనస్కులు.. ఒకవేళ రాజు గారు అలా అనకుండా ఉండి ఉంటే, ఆయన ఆ సంగీత సరస్వతికి మరింత సేవ చేసి ఉండే వారేమో…

Friday, September 21, 2007

రాముడికి సీత ఏమవుతుంది…?

పోయిన వారం బౌధ్ధ రామాయణం లోని కధలని తెలుసుకున్నాం కదా..ఈ వారం ఖోటాన్ రామాయణం లోని కధల్ని తెలుసుకుందాం…

పూర్వం దశరధుడనే రాజు జంబూద్వీపాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు.. అతనికి ఒక కుమారుడు, అతని పేరు “సహస్ర బాహువుడు”.. ఇతను ఎన్నో యుధ్ధాలలో రాజ్యానికి విజయాన్ని చేకూర్చాడు.. ఒకసారి తన పరివారంతో వేటకి వెళతాడు.. అక్కడ విశ్రమించడానికి తగిన వసతి కోసం చూస్తుండగా, ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు.. అతనిని సహాయంకై అర్ధించగా, ఆ బ్రాహ్మణుడు తన దగ్గరనున్న కామధేనువు సహాయంతో వాళ్ళ ఆకలిని తీరుస్తాడు.. ఐతే తరువాత సహస్రబాహువుడు ఆ బ్రాహ్మణుడిని ఆ కామధేనువిని తనకివ్వమని అడుగగా, దానికి నిరాకరిస్తాడు ఆ బ్రాహ్మణుడు.. దాంతో బలవంతంగా దాన్ని అపహరిస్తాడు సహస్రబాహువుడు.. ఐతే ఆ బ్రాహ్మణుడి కుమారుడు(పరశురాముడు) దీన్ని చూసి ఎలాగైనా సహస్రబాహువు మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఘోరమైన తపస్సు చేసి పరశువిని సంపాదిస్తాడు.. దానితో సహస్రబాహువిని హతమారుస్తాడు.. ఐతే ఆ సమయంలో సహస్రబాహువు భార్య తన కుమారులైన “రైస్మణుడు”, “రాముడు” ని పరశురాముడి కంటబడకుండా దాచిపెడుతుంది…

ఇది ఇలా ఉండగా, అప్పుడు లంకా నగరాన్ని దశగ్రీవుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.. అతనికి ఒక కుమార్తె జన్మిస్తుంది.. ఐతే జ్యోతిష్యులు ఆ కుమార్తె వలన అతనికి ప్రాణగండం ఉంది అని చెప్పగా, ఆమెని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేస్తాడు ఆ దశగ్రీవుడు..ఆ బాలిక, ఒక మునికి దొరుకుతుంది.. ఆ ముని ఆమెని చేరదీసి పెంచుతాడు.. ఆమెకోసం ఒక ఆశ్రమం నిర్మించి దాని చుట్టూ ఒక గిరి గీస్తాడు.. ఆమెకి కావలిగా ఒక పెద్ద రాబందుని నియమిస్తాడు.. పక్షులుకూడ ఆ గిరిని దాటి లోపలికి వెళ్ళలేవు.. ఈమె పేరు “సీత”…

అక్కడ రైస్మణుడు, రాముడు పెరిగి పెద్దవారవుతారు.. తమ తండ్రిని చంపిన పరశురాముడి గురించి తెలుసుకుంటారు.. ప్రతీకారాన్ని చల్లార్చుకోవడానికి అతన్ని సంహరిస్తారు, అతన్నే కాకుండా ఇంకా పద్దెనిమిది వేల బ్రాహ్మణులని కూడా వధిస్తారు..

ఒకసారి దేశాటన చేసే సమయంలో, వారికి సీత కనిపిస్తుంది.. ఆమె అందచందాలని చూసి ఇరువురూ మోహిస్తారు.. ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించాలని ప్రయత్నించినా సాధ్యపడదు.. చిన్నగా సీతతో పరిచయాన్ని పెంపొందించుకుంటారు.. ఐతే ఈ సమయంలో ఆ ప్రదేశానికి నూరు కన్నుల లేడి వస్తుంది.. దానిని తీసుకురావడానికి రైస్మణుడు, రాముడు వెళతారు.. ఐతే అదే సమయంలో దశగ్రీవుడు అక్కడికి వస్తాడు…. ఆశ్రమంలో కి వెళ్ళాలని విఫలయత్నం చేస్తాడు.. కానీ ఆ రాబందు అడ్డుకుంటుంది.. దాంతో దానికి విషం కలిసిన మాంసపు ముక్కలని (అసలు కధలో తగరపు ముక్కలు అని ఇచ్చారు) ఆహారంగా వేస్తాడు.. అది తెలియని రాబందు వాటిని తిని మరణిస్తుంది.. దాంతో సీతని అపహరిస్తాడు (అతనికి ఈమె తను నదిలో పారవేసిన తన కుమార్తె అని తెలియదు..)


ఇక్కడ నూరు కన్నుల లేడి కోసం అన్వేషిస్తున్న రైస్మణుడు, రాముడు నిరాశతో తిరిగి వస్తూ ఉండగా, వారికి మార్గ మధ్యంలో, ఒక ముసలి కోతి దారికి అడ్డంగా కూర్చుని ఉంటుంది.. దాన్ని తొలగించడానికి తమ శక్తిమేరకి ప్రయత్నిస్తారు.. కానీ ఆ కోతి బలము ముందు వీళ్ళ బలం ఏ మాత్రం సరిపోదు.. దానితో సిగ్గు పడి ఇక ఆశ్రమానికి తిరిగి వస్తారు.. కానీ అక్కడ చనిపొయిన రాబందు కనిపిస్తుంది.. మనస్సు కీడు శంకించగా, లోనికి వెళ్ళి చూడగా సీత ఎక్కడ కనిపించదు.. దాంతో సీతని వెతకడానికి చెరి ఒక దిక్కుకి బయలుదేరి వెళతారు….


అలా సీత జాడకోసం ప్రయత్నిస్తున్న రైస్మణుడు, రాముడు ఒక నువ్వుల చేనులో కలుసుకుంటారు.. సీత కనబడనందుకు విచారిస్తారు.. ఐతే అదే సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు వానరులు (సుగ్రీవుడు, నందుడు) తమ తండ్రి రాజ్యం గురించి పోట్లాడుకుంటూ ఉంటారు.. నందుడు రైస్మణుడి, రాముడి సహాయం కోరతాడు.. ఐతే వారిద్దరి పోలికలూ ఒకేరకంగా ఉన్నందున, రాముడు నందుడి తోక కి అద్దం కట్టుకోమని సలహా ఇస్తాడు.. ఆ యుధ్ధంలో, రాముడి సలహా వలన, రైస్మణుడి సహాయం వలన నందుడు రాజ్యాన్ని పొందగలుగుతాడు..

తనకి చేసిన సహాయానికి ప్రత్యుపకారంగా, నందుడు తన వానరసేన అంతటినీ సీత జాడ కనుగొనమని పంపిస్తాడు.. పంపించేముందు వాళ్ళకి ఒక హెచ్చరిక చేస్తాడు.. ఒకవేళ వారు కనుక వారం రోజులలోపు సీత ఉనికి కనుగొనని యెడల వాళ్ళ కళ్ళు పీకేస్తానని హెచ్చరించి మరీ పంపిస్తాడు..

ఆరు రోజులు గడిచిపోతాయి.. సీత గురించిన ఒక్క ఆధారం కూడా లభించదు.. ఐతే చివరి రోజు ఒక ఆడ కోతి అక్కడ ఉన్న ఆడ కాకి తన పిల్లలతో చెబుతున్న మాటలని వింటుంది.. ఆ కాకి, తన పిల్లలు ఆకలికి తాళలేక ఏడుస్తుంటే వాళ్ళని ఊరడిస్తూ, ఇంకొక్క రోజు ఆగండి, మీ అందరికీ కోతి మాంసం తో విందు చేస్తాను అని అంటుంది.. దానికి ఆ పిల్లలు అది ఎలా వస్తుంది అని అడుగగా, నందుడు సీత జాడని తెలుసుకోమని వానరులని పంపించాడు కానీ దశగ్రీవుడు సీతని ఎత్తుకుపోయాడు, ఈ వానరులకి ఆ సంగతి తెలియదు అని చెబుతుంది.. ఇది విన్న ఆ ఆడ కోతి ఈ వానరుల దగ్గరికి వచ్చి వారిని ఏడిపిస్తూ ఉంటుంది.. ఐతే ఒక మగ కోతి దాన్నుండి, ఈ విషయాన్ని రాబడుతుంది.. వానరులందరూ కలిసి నందుడికి ఈ విషయాన్ని చేరవేస్తారు.. ఇక దశగ్రీవుడి మీద యుధ్ధం చేయాలని నిశ్చయించుకుంటారు రైస్మణుడు, రాముడు.. నందుకి ఒక వరం ఉంది.. అతని చేతితో నీళ్ళలో వేసిన రాళ్ళు తేలతాయని.. ఆ విధంగా వానర సైన్యంతో కూడి రైస్మణుడు, రాముడు లంకని చేరుకుంటారు…

అక్కడ లంకలో దశగ్రీవుడి మంత్రులు అతనికి హిత వాక్యాలని చెబుతారు.. స్తీలని మోహించిన వారు బాగుపడ్డట్లు చరిత్రలో లేదు అని కూడా అంటారు.. అయినా దశగ్రీవుడు వారి మాట పెడచెవిన పెడతాడు.. దాంతో ఆ మంత్రులు శతృశిబిరంలోకి మారిపోతారు…

యుధ్ధం భీకరంగా జరుగుతూ ఉంటుంది..అయితే యుధ్ధంలో వానర సేనదే పై చేయిగా ఉంటుంది.. దానితో ఆ రోజు యుధ్ధంలో దశగ్రీవుడు, సముద్రంలోని ఒక విష సర్పాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తాడు.. దానికి రాముడు మూర్చపోతాడు.. సంజీవని మూలిక తెస్తే బ్రతుకుతాడని వైద్యులు చెబుతారు.. నందుడు దాన్ని తీసుకురావడానికి బయలుదేరతాడు.. ఐతే ఆ మూలిక పేరు గుర్తు రాకపోవడంతో, హిమవత్పర్వతాన్ని పెకిలించుకుని వస్తాడు.. రాముడు కళ్ళు తెరుస్తాడు.. ఈ సారి దశగ్రీవుడు వికటట్టహాసం చేస్తూ సీతతో సహా ఆకాశంలోకి ఎగురుతాడు.. అది చూసి రాముడు మాళ్ళీ మూర్ఛపోతాడు.. అయితే దశగ్రీవుడి ఆయువుపట్టు అతని కాలి బొటనవేలు లో ఉంది అని తెలుసుకున్న రాముడు బాణం సంధిస్తాడు.. దశగ్రీవుడు క్రింద పడిపోతాడు.. లేచి రైస్మణుడిని, రాముడిని శరణు వేడతాడు. దానితో దశగ్రీవుడిని చంపకుండా వదిలేస్తారు… అంతకుముందు రాముడిని మూర్చితిల్లుడిని చేసిన నాగుల మీద తమ ప్రతీకారం తీర్చుకుంటారు రైస్మణుడు, రాముడు..

సీతతో కూడి, జంబూద్వీపాన్ని చేరుకుంటారు.. రైస్మణుడు, రాముడు ఇరువురూ సీతని వివాహం చేసుకుంటారు… ప్రజారంజకంగా నూరేళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారు.. ఐతే తరువత ప్రజలలొ అసంతృప్తి ప్రబలుతుంది.. రైస్మణుడు కానుకలిచ్చి ప్రజలని సంతృప్తి పరచాలని ప్రయత్నిస్తాడు.. సీత ఏమో తను దశగ్రీవుడి ఆధీనంలో ఉండి రావడం వలన ఇలా జరిగిందనుకుని భూమిని చీల్చుకుని ప్రాణత్యాగానికి సిధ్ధపడుతుంది..

ఇవీ ఖోటాన్ రామాయణం లోని విశేశాలు.. ఇంకో విశేషం కూడా ఉంది.. ఈ కధ క్రీ.శ.తొమ్మిదవ శతాబ్దానికి ప్రాచుర్యంలో ఉన్న కధ…

మనకి ఈ కధ చదువుతూ ఉంటే మన భారతంలోనూ, రామాయణంలోనూ ఉన్న పోలికలు కనిపిస్తూ అంతా కొంచెం గందరగోళంగా అనిపించచ్చు…

సహస్రబాహువు, బ్రాహ్మణుడిని కామధేనువు ఇవ్వమని అడగడం, “విశ్వామిత్రుడు వశిష్టుడిని కామధేనువు” అడిగిన సంఘటన ఒకటే…

దశగ్రీవుడు, సీతని ఒక బుట్టలో పెట్టి పారవేయడం, కుంతి కర్ణుడిని వదిలిపెట్టిన సంఘటనకి సారూప్యం.. ఐతే వీరు ఇరువురూ వేరు వేరు ఉద్దేశ్యాలతో ఆ పని చేశారు..

ఇక్కడ నూరు కన్నుల లేడి ఉంటే, మన రామాయణంలో రంగు రంగుల లేడి…

ఇక్కడ సీతని పెంచిన ముని గిరి గీసి దాంట్లో ఆమెని ఉంచితే, అక్కడ లక్ష్మణుడు అలా చేస్తాడు..


రైస్మణుడు, రాముడు అడవిలో తిరుగుతూ ఉండగా, ముసలి కోతి కనబడడం.. ఇది, భారతంలో, భీముడికి హనుమంతుడు కనిపించిన సంఘటనకి దగ్గరగా ఉంటుంది..


ఇక రాముడు మూర్ఛపోతే, నందుడు వెళ్ళి సంజీవని తీసుకురావడం, హనుమంతుడు లక్ష్మణుడికి చేసిన ఉపచారము ఒకటే…

పోలికలు ఎలా ఉన్నాయో, కొన్ని విరుధ్ధాలు కూడా కనిపిస్తాయి..

వాల్మీకి రామాయణం ప్రకారం, రావణుడు చనిపోవాలి.. కానీ ఇక్కడ దశగ్రీవుడిని క్షమించి వదిలేస్తారు..

అక్కడ సీత పాతివ్రత్య పరీక్ష, రావణుడి చెర నుండి విడిపించగానే చేస్తే, ఇక్కడ నూరు సంవత్సరాల తరువాత చేస్తారు..

మనకి ఈ కధలో ఇంకో ఆచారం కూడా కనిపిస్తుంది.. అన్నదమ్ములిద్దరూ ఒకే కన్యని వివాహమాడడం.. ఇప్పుడు ఉన్న ఆచారానికి ఇది విలోమంలో ఉంది.. ఇప్పుడు ఒకే పురుషుడు అక్కచెల్లెళ్ళని వివాహమాడచ్చు.. అంటే ఒకప్పుడు కన్యాశుల్కం, ఇప్పుడు వరకట్నం మాదిరి..

ఇదీ ఖోటాన్ రామాయణం లోని కధ.. వచ్చేవారం బౌధ్ధ ప్రభావం గల వేరే కధలని తెలుసుకుందాం..

గురజాడ

“పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టును…” ఈ మాటలన్న గిరీశం అంటే తెలియని వాళ్ళు బహుశా తెలుగునాట ఉండరేమో… అలంటి అద్భుత పాత్రని సృష్టించిన గురజాడ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ రోజు మనం వారి 145వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.. ఈ సందర్భంలో వారి గురించి మరొక్కసారి స్మరించుకుందాం…

“గురజాడ” గా ప్రసిధ్ధులైన వీరి పూర్తి పేరు “గురజాడ వెంకట అప్పరావు”.. ఈయన 1862వ సంవత్సరంలో, వెంకట రామ దాసు, కౌసల్యమ్మ దంపతులకి జన్మించారు..ఈయన స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని రాయవరం గ్రామం.. విజయనగరంలోని మహారాజా కళాశాల నుండి పట్టబధ్రులైనారు.. విద్యాభ్యాసం పూర్తైన తరువాత విజయనగర ఆస్థానంలో రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేశారు..

అప్పటివరకూ, గ్రాంధికంలో సాగుతున్న రచనలని వ్యావహారిక భాషలోకి మార్చిన ఘనత కూడ గురజాడ వారికే దక్కుతుంది.. ఈయన స్నేహితుడు గిడుగు రామ్మూర్తి గారు దీంట్లో గురజాడ గారికి చాలా సహాయపడ్డారు .. అందుకే గిడుగు రామ్మూర్తి గారి జయంతిని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం..

ఎన్నో విషయాలలో, గురజాడ వారు ప్రధములు.. ప్రప్రధమంగా ఆధునిక తెలుగు సాహిత్యం లో చిన్న కధలు వ్రాయడం మొదలు పెట్టింది గురజాడ, మొట్టమొదటి సాంఘిక నాటకాన్ని వ్రాసింది కూడా వీరే… ఇప్పుడు ఉన్న తెలుగు సాహిత్యానికి ఆద్యులు కూడా వీరే..

మొట్టమొదటిసారి 1892లో గురజాడ గారు వ్రాసిన “కన్యాశుల్కం” నాటకం ప్రదర్శింపబడింది.. అప్పట్లో అది సంభాషణల పరంగా, ఆచారాల పరంగా ఒక పెను సంచలనం… అప్పటివరకు నాటకాలలో వ్యావహారిక భాషని ఉపయోగించేవారు కాదు.. అప్పుడప్పుడూ కొన్ని నాటకాలలో కొన్ని పాత్రలతో మామూలు భాష మాట్లాడించేవాళ్ళు కానీ ప్రాధాన్యమైన పాత్రలన్నీ గ్రాంధికంలోనే సాగుతూ ఉండేవి..అప్పటికే కందుకూరి వీరేశలింగం గారు “బ్రహ్మ వివాహం” అనే నాటకాన్ని సామాన్యుల భాషలోనే వ్రాశారు.. ఐతే ఆయన దాన్ని కేవలం మూఢాచారాలని నిర్మూలించడానికి ఉపయోగించారు తప్ప సాహిత్య పరంగా పెద్ద మెరుగులు పెట్టలేదు.. కానీ కన్యాశుల్కం మాత్రం రెండు రకాలు గానూ విజయం సాధించింది.. కన్యాశుల్కం ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో సంచలనాన్ని నమోదు చేసింది.. ఒకవేళ ఎవరైనా ప్రపంచంలోని పేరెన్నికగన్న వంద సాహిత్య అంశాలని కనుక తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా, కన్యాశుల్కం వాటిల్లో తప్పకుండా ఒకటిగా ఉంటుంది.. కన్యాశుల్కానికి మరొక విశిష్టత కూడ ఉంది.. “అంకితం, కృతజ్ఞతలు” ఆంగ్లంలో ఉన్న మొట్టమొదటి పుస్తకం అదే…

ఇప్పుడు మనం పాఠ్య పుస్తకాలలో చదువుకుంటున్న ఈ భాష మొత్తం గురజాడ గారి పుణ్యమే..

కేవలం కన్యాశుల్కం కాకుండా ఆయన ఎన్నో ప్రసిధ్ధ రచనలు చేశారు.. ఆయన 1901లో వ్రాసిన “ముత్యాల సరాలు” పద్య కవితలలో ఒక క్రొత్త ఒరవడిని సృష్టించింది.. ఆయన వ్రాసిన “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అనే పాట ప్రతి తెలుగు వాడి నోళ్ళలోనూ నానుతూనే ఉంటుంది… ఇంకా ఆయన వ్రాసిన వాటిల్లో పేరెనికగన్నవి.. “కౌమిది భట్టీయము”, “నీలగిరి పాటలు”..

గురజాడ గారి మీద ఎంతో మంది ప్రసిధ్ధి గాంచిన రచయితలు ఎన్నో పుస్తకాలు వ్రాశారు.. వాటిల్లో ప్రముఖమైనవి, “ గురజాడ డైరీలు” (ఇది గురజాడ మరణానంతరం బుఱ్ఱా శేషగిరి రావు గారు వ్రాశారు), “యుగకర్త గురజాడ – శ్రీశ్రీ”..

మన తెలుగు భాషకి ఇంత సేవ చేసిన గురజాడ గారికి ఘనంగా నివాళులు అర్పిద్దాం..

Thursday, September 20, 2007

సొమ్మొకరిది సోకొకరిది……….!!!

తెలుగు వాళ్ళలో ఈ సామెత తెలియని వాళ్ళు చాలా తక్కువమంది.. కానీ ఇప్పుడు ఈ సామెత తెలియని వాళ్ళకి కూడ దాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు.. మన జె.ఎన్.టి.యు. వాళ్ళు…!

ఏదో ఇప్పుడు ఉంది దేవుడి పాలన కదా అనే ఉద్దేశ్యంతో, వరుణుడు కొంచెం ఎక్కువగానే వర్షాలు పడేటట్లు చేస్తున్నాడు…. మొన్న వర్షాలు వచ్చేవరకు ఖాళీ గా గోళ్ళు గిల్లుకుంటున్న మేఘమధనం శాఖ వాళ్ళు ఈ వర్షాలకి వచ్చిన మబ్బుల్లో చకచకా మేఘ మధనం చేస్తున్నారట… అంటే వరుణుడు కురిపించిన వర్షాలని జె.ఎన్.టి.యు వాళ్ళు తాము కురిపించామని గొప్పలు చెప్పుకుంటారనమాట…. అయినా "It Happens" అంతే.. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ...

http://eenadu.net/story.asp?qry1=21&reccount=30

http://eenadu.net/breakhtml1.asp

Wednesday, September 19, 2007

ధర్మసందేహం

మనది ప్రజాస్వామ్య దేశం కదా… ఇక్కడ ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్ర్య హక్కు ఉంది.. అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు*.. అయితే అక్కడే ఒక చిన్న మెలిక కూడ ఉంది (conditions apply) అంటే ఏదైనా మట్లాడచ్చు కానీ, అది వేరే వ్యక్తులని, సంస్థలని, వాళ్ళ మనోభావాలనీ కించపరచకూడదు.. ఒకవేళ అలా చేస్తే అది నేరము అని చిన్నప్పుడు చదువుకున్నాను..

మరి అలాంటప్పుడు, గౌరవనీయులైన కరుణానిధి గారు, రాముడు ఎక్కడ ఉన్నాడు, ఏ తాంత్రిక విద్యాలయంలో (ఇంజనీరింగ్ కళాశాలలో) చదివాడు…? ఇంజనీరింగ్ పట్టా ఎప్పుడు పుచ్చుకున్నాడు..? ఇలా అంటున్నారు కదా.. ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి.. మరి వాళ్ళకి ఆయన మీద కేస్ పెట్టాలనే ఆలోచన రాలేదా….??!!

Monday, September 17, 2007

ఎందరో మహానుభావులు – 3

పోయిన వారం సంగీత సాహిత్యాలలో, విప్లవకారుడిగా ప్రసిధ్ధి గాంచిన “శ్రీ దాసు శ్రీరాములు” గురించి తెలుసుకున్నాం కదా.. ఈ వారం దూర్వాసుడి లాంటి బొబ్బిలి కేశవయ్య గారి గురించి తెలుసుకుందాం…

కేశవయ్య గారు గోపాలయ్య, రంగనాయకమ్మ దంపతులకి జన్మించారు.. తన తండ్రి గారి వద్దనే సంగీతాన్ని అభ్యసించారు.. ఆయనకి ఉన్న పాండిత్యం వలన, అతి పిన్న వయసులోనే బొబ్బిలి ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు.. ఐతే అనుకోకుండా వారి తల్లిగారు కాలం చేశారు.. కేశవయ్య గారు మొదలు నరికిన చెట్టులా కూలిపోయారు.. అసలు సంగీతం వైపు చూడడం లేదు.. ఇదంతా చూసిన రాజు గారు బాధపడ్డారు.. కేశవయ్య గారిని ఇలానే వదిలేస్తే ప్రమాదకరమని భావించిన ఆయన, మార్పుగా ఉంటుందని వేరే ఆస్థానాలకి పోటీలకి పంపడం ఆరంభించారు..

ఎంత బాధలో ఉన్నా, విద్య ఎక్కడికీ పోదు కదా.. పోటీలకంటూ వెళ్ళిన తరువాత, వెనుదిరిగి చూడడమనేది బొబ్బిలి వారి చరిత్రలోనే లేదు కదా.. ఇక అప్పటినుండీ, బెబ్బులిలాగా విజృంభించారు కేశవయ్య గారు..

వేరే ఆస్థానాలకి వెళ్ళడం, అక్కడి వాళ్ళందరిని పోటీకి రమ్మని ఆహ్వానించడం, పోటీలో వారిని చిత్తుగా ఓడించి అక్కడి వారి ప్రశంశలు, బహుమతులు అందుకోవడం ఇలా జరుగుతూ ఉండేది..

ఐతే, కేశవయ్య గారితో పోటీలో పాల్గొనాలంటే, ముందు ఆయన పెట్టే షరతులకి ఒప్పుకోవాలి.. అదేమంటే ఓడిపోయిన వారు, వాళ్ళ తంబూర, బిరుదులు అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోవాలి.. కేశవయ్య గారికి ఉన్న పట్టువలన, ఆయనని ఓడించడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు.. ఎలాంటి కళాకారుడికైనా తంబూర ఇవ్వడం అంటే, తన ప్రాణానికి ప్రాణమైన సంగీతాన్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టడమే కదా.. పాపం కొంతమంది సున్నిత మనస్కులు, ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకునేవారు.. కానీ ఇవేవీ కేశవయ్య గారికి పట్టేవి కాదు.. తను పెట్టిన షరతుల వలన, మనుష్యుల ప్రాణాలు మట్టిలో కలిసిపోతున్నా ఆయన కొంచెం కూడ చలించేవారు కాదు.. ఎక్కడ పోటీ జరిగినా అక్కడికి వెళ్ళడం, అందరినీ ఓడించడం, వాళ్ళ తంబూరాలని, బిరుదులని లాక్కొచ్చేయడం సర్వ సాధారణమైపోయింది ఆయనకి.. ఏ పోటీకి వెళ్ళిన ఇదే తంతు.. అందుకే కేశవయ్యగారు “ప్రళయకాల ఝుంఝుంమారుతం”, “గాన కేసరి” లాంటి బిరుదులు పొందారు.. భూలోకంలో ఉన్న కళాకారులందరినీ చాప చుట్టినట్లు చుట్టేస్తుండడం వలన ఆయనని “భూలోక చాప చుట్టి కేశవయ్య” అని కూడా పిలిచేవారు…

ఎంత విద్వత్తు ఉన్నా, అహంకారంతో కూడిన విద్య ఎప్పుడోకప్పుడు దెబ్బ తినాల్సిందే.. కేశవయ్యగారి విషయంలో కూడా అదే జరిగింది.. భూలోకాన్ని మొత్తం చాప చుట్టేస్తున్న కేశవయ్యగారు, తంజావూరులో అడుగు పెట్టారు.. అప్పట్లో తంజావూరు సంగీత సాహిత్యాలకి పెట్టింది పేరు.. కానీ షరా మాములుగా కేశవయ్య గారు ఆస్థాన విద్వాంసులని హడలగొట్టేస్తున్నారు.. అది చూసి తులజాజీ మహారాజు గారు కంగారుపడిపోయారు.. పరుగు పరుగున వెళ్ళి శ్యామశాస్ట్రిగారి కాళ్ళ మీద పడ్డారు.. ఆస్థానానికి రమ్మని వేడుకున్నారు.. కానీ శ్యామశాస్త్రిగారు ససేమీరా అన్నారు.. ఆస్థానాలలో నేను పాడను అని తెగేసి చెప్పారు.. ఐనా రాజా వారు పట్టు విడవలేదు.. ఆస్థాన పరువు ప్రతిష్టలు కాపాడాలి అని శ్యామశాస్త్రిగారిని ఒప్పించారు.. ఇక రాజు గారి మాట తీసేయ్యలేక, కామాక్షి దేవి గుడికి వెళ్ళి ఆమెని “దేవీ సమయమిదే(చింతామణి రాగం)” లో స్తుతించి పోటీకి బయలుదేరారు..

పోటీ మొదలయ్యింది.. వికటాట్టహాసం చేస్తున్నారు కేశవయ్యగారు.. అటు వైపు ప్రసన్న వదనంతో శ్యామశాస్త్రిగారు.. “సింహనందన తాళంలో“ పాటని ఆరంభించారు కేశవయ్యగారు.. పాట అయిపోయింది.. సభ మొత్తం స్థాణువైపోయింది.. మరి అంత జగన్మోహనంగా చేశారు కచేరీ.. మహారాజు గారు భయభయంగా శ్యామశాస్త్రి గారి వైపు చూశారు.. తన ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుని, గొంతు సవరించుకుని, “శరభ నందన” తాళంలో మొదలుపెట్టారు.. ఈ సారి అవాక్కవడం కేశవయ్య గారి వంతైంది.. శ్యామశాస్త్రి గారు ఆ సంగీత సరస్వతికి స్వరాభిషేకం చేస్తున్నారు.. నటరాజు, విష్ణుమూర్తి, కామాక్షి దేవి, ఇలా ఒకరేమిటి అందరూ కనిపిస్తున్నారు ఆయనలో… బిత్తరపోయింది ఆ ప్రళయకాల ఝుంఝుంమారుతం.. తెలియకుండానే కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి.. అప్పటివరకు అహంకారంతో మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయి.. తన కన్నిటితో శ్యామశాస్త్రి గారికి పాదాభిషేకం చేశారు కేశవయ్య గారు…

చూశారా ఎంత తెలివితేటలున్నా, ఎంత గొప్పవారైనా వినయంలేని విద్య శోభించదు అని మనకి కేశవయ్యగారి జీవిత చరిత్ర ద్వారా తెలుస్తుంది కదా..

Friday, September 14, 2007

రామునికి సీత ఏమవుతుంది…?

ఏంటీ నిన్నే కదా ఏదో కధ వ్రాస్తానని చెప్పి మళ్ళీ ఈ కధ వ్రాస్తున్నాను అనుకుంటున్నారా.. మరి మన ప్రభువులు కూడా వాళ్ళ మాట వెనక్కి తీసుకున్నారు కదండీ.. నేనూ అంతే.. "యధా రాజా తధా ప్రజా" అని ఊరికే అన్నారా..? సరే మనం మళ్ళీ కధలో కి వచ్చేద్దాం.. పోయిన వారం “పేరుతెలియని రాజు కధ”ని గురించి తెలుసుకున్నాం కదా..ఈ వారం “దశరధ జాతకం” గురించి తెలుసుకుందాం..

దశరధ జాతకం:

పూర్వకాలంలో దశరధుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు..ఆయనకి పదహారువేల మంది భార్యలు…(ఇదేంటి కృష్ణుడికి కదా అనుకుంటారేమో ఇది బౌధ్ధ రామాయణం కదా.. దీంట్లో, బుధ్ధుడు రెండు అవతారాలని ఒకేసారి ధరించాడు అనుకుంటా..!) సరే ఆయన పట్టపురాణికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.. పెద్ద కుమారుడి పేరు “రామ పండితుడు”, రెండో కుమారుడి పేరు “లక్ష్మణ పండితుడు”(ఇక్కడ వరకు బానే ఉంటుంది.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్), కుమార్తె పేరు “సీత”..(మన సౌలభ్యం కోసం వాళ్ళని రాముడు, లక్ష్మణుడు, సీత గా వ్యవహరించుకుందాం)

అనారోగ్య కారణాల వలన పట్టపురాణి కాలం చేసింది.. తరువాత తనకున్న మిగిలిన భార్యలలో ఒక రాణిని దశరధుడు పట్టమహిషిగా చేసుకున్నాడు.. ఈ రాణి అంటే దశరధుడికి వల్లమాలిన అభిమానం..ఆమె వలన ఒక కుమారుడు జన్మిస్తాడు.. అతని పేరు భరతుడు..ఆ ఆనంద సమయంలో, రాణినికి ఒక వరం కోరుకోమంటాడు.. దానికి ఆవిడ ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు నా కోరిక తీర్చండి అని అంటుంది..

సరే ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటాయి.. రాముడు, లక్ష్మణుడు, సీత అందరూ యుక్తవయసుకి వస్తారు..భరతుడికి ఏడేళ్ళు వచ్చిన తరువాత పట్టపురాణి దశరధుడి దగ్గరకు వెళ్ళి, తన బిడ్డని రాజుని చేయమని వరం కోరుకుంటుంది.. కానీ దశరధుడు మొదట్లో దీనికి ఒప్పుకోడు. ఇక రాణి, సామ దాన బేధ దండోపాయాలలో భాగంగా, అలిగి ఆగ్రహగృహాన్ని చేరుతుంది.. విషయం తెలుసుకున్న దశరధుడు మొదట మధనపడతాడు, తరువాత తన పరిస్థితికి తానే జాలిపడతాడు, చివరిగా రామ లక్ష్మణు లని ఏమన్నా చేస్తుందేమో అని భయపడతాడు.. దాంతో, హుటాహుటిన జ్యోతిష్యులని పిలిపిస్తాడు, తన ఆయుర్దాయం ఎంత ఉందో లెక్కలు వేయమంటాడు.. వాళ్ళు గ్రహాల స్థితిగతులని బట్టి మీరు పన్నెండేళ్ళు జీవిస్తారు అని చెబుతారు.. సరే అని వెంటనే రామ, లక్ష్మణులని పిలిపిస్తాడు. మీరు ఇక్కడే ఉంటే, మీ సవతి తల్లి మిమ్మల్ని చంపేయవచ్చు కాబట్టి, ఈ పన్నెండేళ్ళు వనవాసం చేసి నేను చనిపోయిన తరువాత వచ్చి రాజ్యాన్ని పరిపాలించండి అని చెబుతాడు.. దానికి వాళ్ళిద్దరూ సరే అని బయలుదేరుతుండగా, ఇంతలో సీత అక్కడకి వచ్చి, నేను కూడా అన్నలతో కూడి వనవాసానికి వెళతాను అని వెళ్ళిపోతుంది.. ముగ్గురూ హిమాలయాలకి (హిమాలయాలలో ఉన్న అరణ్యాలకి) వెళ్ళి అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉంటారు..

ఇక్కడ దశరధుడేమో, పుత్రశోకంతో తొమ్మిదేళ్ళకే మరణిస్తాడు.. ఆ వెంటనే భరతుడు రాజ్యం చేపడదామని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా, మంత్రులు దానికి ఒప్పుకోరు.. అసలు రాజు వనవాసంలో ఉన్నాడు, ఆయన తప్ప వేరెవరూ రాజ్యాన్ని చేపట్టకూడదని ఆంక్షలు పెడతారు.. దీంతో చేసేదేమి లేక, భరతుడు రాముడిని తీసుకురావడానికి అరణ్యానికి వెళ్తాడు.. సరిగ్గా భరతుడు వెళ్ళిన సమయానికి, ఆశ్రమంలో రాముడు ఒక్కడే ఉంటాడు, సీత లక్ష్మణులు పని మీద బయటకి వెళ్ళారు.. తండ్రి మరణ వార్త విన్న తరువాత కూడ ఏమీ చలించలేదు రాముడు (మన రామయణం లో, రాముడు బాగా బాధపడ్డాడని చదివినట్లు గుర్తు, కానీ ఇలాంటి వర్ణనలు తెలుగు వాళ్ళకి బాగ నచ్చుతాయి ఎందుకంటే, ఎన్ని కష్టాలు వచ్చిన హీరో నిశ్చలంగా, స్థిరచిత్తుడై ఉండాలి కానీ ఏడవకూడదు..!) సరే ఇంతలో, సీత లక్ష్మణులు ఆశ్రమానికి చేరుకుంటారు.. రాగానే రాముడు వాళ్ళిద్దరినీ ఏటిలో స్నానం చేసి రమ్మంటాడు.. నీటిలో దిగగానే తండ్రి మరణవార్త వాళ్ళకి తెలియజేస్తాడు.. అది తెలియగానే, సీతాలక్ష్మణులు మూర్ఛపోతారు.. రాముడు వాళ్ళని ఊరడిస్తాడు.. తండ్రికి చేయవల్సిన శ్రాధ్ధకర్మలని ముగ్గురూ ఆచరిస్తారు..

అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత, భరతుడు రాముడిని రాజ్యానికి రమ్మని కోరతాడు.. దానికి రాముడు నిరాకరిస్తాడు.. నన్ను తండ్రిగారు పన్నెండేళ్ళు వనవాసం చేయమన్నారు, ఇప్పటికి తొమ్మిదేళ్ళే పూర్తైంది, మిగిలిన మూడేళ్ళు పూర్తైన తరువాతనే రాజ్యానికి తిరిగివస్తాను అని చెబుతాడు.. ఐతే సీతని, లక్ష్మణుడిని నీతో తీసుకువెళ్ళు, నీకు పరిపాలనలో సహాయపడతారు అని అంటాడు.. దానికి భరతుడు మరి రాజ్యాన్ని ఎవరి పేరున పరిపాలించాలి అని అడుగగా, దానికి రాముడు, నా పాదుకలని తీసుకువెళ్ళు, నేను వచ్చేంతవరకు అవే రాజ్యాన్ని పరిపాలిస్తాయి అని చెబుతాడు.. దాంతో భరతుడు, సీతని, లక్ష్మణుడిని, రాముడి పాదుకలని తీసుకుని రాజ్యానికి వెళ్ళిపోతాడు..

పాదుకల సహాయంతో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు.. అవి మామూలు పాదుకలు కావు, శక్తివంతమైనవి.. సింహాసనం మీద పాదుకలని అధిష్టించేవాళ్ళు.. వాటి ముందే తీర్పులు చెప్పేవారు.. తీర్పు సరిగ్గా లేకపోతే అవి వాటిలో అవి పోట్లాడుకొనేవి.. సరియైనది ఐతే మాములుగా ఉండేవి.. ఈ విధంగా మూడేళ్ళు గడిచిన తరువాత, రాముడు రాజ్యానికి తిరిగి వస్తాడు..

రాముడిని శాస్త్రోక్తంగా పట్టాభిషిక్తుడిని చేస్తారు.. సీతతో వివాహం చేస్తారు. రాముడు మహారాజుగా, సీత పట్టపురాణిగా పదహారువేల సంవత్సరాలు పరిపాలన సాగిస్తారు..

ఇదీ దశరధ జాతక కధ.. మొదట్లో అంతా బావున్న ఈ కధ, చివరిలో మింగుడు పడకపోవచ్చు.. నీతి, నియమాలకి కట్టుబడే రాముడు సొంత చెల్లిని ఎలా వివాహం చేసుకుంటాడు అని అనిపించచ్చు.. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.. ఈ కధ ఇప్పుడు జరిగింది కాదు.. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగింది.. అప్పటి నియమాలు వేరు, కట్టుబాట్లు వేరు.. ఆ కాలంలో ఏకోదరులైన వారి మధ్య వివాహమే న్యాయసమ్మతం.. దానికి కట్టుబడే రాముడు, సీతని వివాహం చేసుకుంటాడు.. మనం దీనికి చారిత్రక ఆధారలకోసం పరిశీలించినా కూడా దొరుకుతాయి..!! ఈజిప్ట్ నాగరికతలో, ఇలాంటి ఆచారాలు ఉండేవి.. ఆ దేశపు నాగరికత ఈ ఆచారమంత ప్రాచీనం.. అయినా అక్కడిదాక వెళ్ళక్కర్లేదు మన వేదాలలో కూడ ఈ ఏకోదరుల మధ్య వివాహ ప్రస్తావన ఉంది.. దానికి ఉదాహరణ “యమ యమి జంట”.. అసలు యమ అన్న పదానికి, ఒక అర్ధం జంట అని కూడా….

దీన్ని బట్టి మనకి రెండు విషయాలు తెలుస్తున్నాయి.. ఎప్పుడో ఈజిప్ట్ లో పాటించిన ఆచారాలు రామాయణంలో ఉన్నాయి అంటే, పూర్వకాలంలో రాముడి రాజ్యం అంత విస్తృతమైంది అని ( ఒక సంవత్సరం క్రితం అనుకుంటా ఈజిప్ట్ లోనో, దానికి దగ్గర ప్రాంతాలలో, శిధిలమైన విష్ణుమూర్తి విగ్రహాలు దొరికాయని వార్త వచ్చింది), అప్పటి ఆచారాలు ఎన్నో మార్పులు చేర్పులు పొందాయని..

వచ్చేవారం బౌధ్ధ ప్రభావంగల, ఖోటాన్ రామాయణంలోని కధలని తెలుసుకుందాం..

Thursday, September 13, 2007

అంతా భ్రాంతియేనా……

మన సముద్రాల మహాశయుడికి ముందుచూపు బాగా ఉన్నట్లుంది.. అందుకే ఈ పాట పూర్వ కాలంలోనే వ్రాశారు..

నిజమే "It Happens".. ఐనా మనం ఇప్పుడు ఉన్నది సాక్షాత్తు ఆ దేవుడి పాలనలో, ఇలాంటి సమయంలో, ఎప్పుడో ఆ రాముడు కట్టిన ఏదో పిల్ల వారధి గురించి ఇంత రాధ్ధాంతం ఎందుకు చేస్తున్నారో నాకు అర్ధం కావట్లేదు…!

నిన్న సుప్రీమ్ కోర్ట్ లో, మన ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు ఏమి చెప్పారు.. రాముడు లేడు, రామాయణం అంతకన్న లేదు.. అసలు రాముడు కట్టాడు అనడానికి చారిత్రక ఆధారాలు కూడ లేవు అని అన్నారు..

అయినా నాకు తెలియక అడుగుతాను.. మన కళ్ళముందు బాంబులు పేలుతున్నా, ఆ పెట్టిన వాళ్ళని పట్టుకోలేకపొతున్నం.. ఎందుకంటే వాళ్ళెక్కడో ఏదో దేశం లో ఉన్నారని.. ఇప్పుడు జరుగుతున్నవాటికే ఏ ఆధారాలు చూపించలేని మనం, ఇక ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఏమని చెప్పగలం….

ఇక్కడ వేరే వాదన చూద్దాం.. నాసా వాళ్ళు ఇంకా కొంతమంది శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనల్లో, ఆ రాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు (1750000) క్రితం వని చెప్పారు.. మన పురాణాల లెక్కల ప్రకారం త్రేతా యుగం కాలానికి అటు ఇటు గా ఉంది ఆ లెక్క… సరే పురాణాలు ఎంత నిజం, ఎంత అబధ్ధం అనే దాన్ని ప్రక్కన పెడితే, చాలామంది హిందువులు దాన్ని నిజంగానే, రాముడు కట్టిన వారధిగా నమ్మడం మొదలుపెట్టరు..

కానీ ఇక్కడ మనం ఒక సంగతి గుర్తు తెచ్చుకోవాలి.. భగవద్గీత లో, శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు(అసలు రాముడే లేడు అంటుంటే మధ్యలో కృష్ణుడు ఎందుకు అని అనచ్చు.. కానీ ఆయన చెప్పిన సిధ్ధాంతాన్ని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు..!!!) ఒక శ్లోకంలో, పరధర్మం ఎంత మంచిది ఐనా, నీ ధర్మం ఎంత తప్పైనా, పరధర్మం మాత్రం ఎప్పుడు పాటించకు, ఎల్లెడలా స్వధర్మాన్నే పాటించు అని చెప్పాడు… మనం దాన్ని ఆదర్శంగా తీసుకుంటే, అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మన ఆర్కియాలజీ వాళ్ళు చెప్పే కాకమ్మ కధలని ఎటువంటి బాధ లేకుండా హాయిగా వినచ్చు..

ఇంత మంది కలిసి పాపం సోనియమ్మని ఆడిపోసుకుంటున్నారు కానీ, కేవలం ఆవిడ వల్లే కదా మనం ఇప్పుడు దేవుడి పాలన, ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే, అంతకన్న ఎక్కువైన ఇందిరమ్మ పాలన లో ఉన్నాం.. నాకు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రొత్తలో, ఇందిరమ్మ పాలన తెస్తాం అది ఇది అని అంటుంటే ఏమీ అర్ధమయ్యేది కాదు.. ఎందుకంటే, నేను పుట్టేసరికి ఇందిరమ్మ చనిపోయింది నేను పుస్తకాలలో, రాముడి గురించి, అశోకుడు గురించి చదువుకున్నాను కానీ, ఇందిరమ్మ రాజ్యం గురించి తెలుసుకోలేకపోయిన అజ్ఞానిని.. సర్లే అయినా తినబోతూ గారెల రుచి ఎందుకు అన్నట్లు, ప్రాక్టికల్గా చూద్దాం లే అనుకుంటే, ఇప్పుడు తెలుస్తోంది కేవలం ఇందిరమ్మ మాత్రమే ఇంత గొప్ప పాలన అందివ్వగలదు అని..!!

అయినా రామాయణం ఐనా, బైబెల్ ఐనా, ఖురాన్ ఐనా ఏమి ఘోషిస్తున్నాయి.. అందరు దేవుళ్ళు ఒకటే అనే కదా.. అలాంటప్పుడు మనం ఇంత బాధ పడడం ఎందుకు.. రాముడిని పూజించే బదులు ఏ అల్లానో, లేక క్రీస్తునో పూజిద్దాం.. అప్పుడు మన ప్రభువులూ సంతోషపడతారు.. (పనిలో పనిగా నేను “రాముడికి సీత ఏమవుతుంది – రెండో భాగానికి బదులు "క్రీస్తుకి మేరీ మాత ఏమవుతుంది" – మొదటి భాగం వ్రాస్తే సరిపోతుంది..!)

అయితే ఇక్కడ ఇంకో ఇబ్బంది కూడా ఉంది.. ఏదో మన విష్ణుమూర్తికి ఉన్న దశావతారాల పుణ్యమా అని మనకి ఏడాదికి చాలా పండగలు వాటికి సెలవులు ఎన్నో ఉన్నాయి.. కానీ ఇప్పుడు సోనియమ్మ పాలనలో, ఇవేవి ఉండవు.. కేవలం ఒకే ఒక్కరోజు…..! కాబట్టి ఇందిరమ్మ ప్రజలారా (కాదు కాదు సోనియమ్మ ప్రజలారా) ఇలాంటి షాక్ లు ముందు ముందు చాలా వస్తాయి.. కాబట్టి మీరందరూ వాటికి మానసికం గా సంసిధ్ధులు కాగలరని కోరుకుంటూ, మీ అందరికీ ఆ రాముడు ( అలవాట్లో పొరపాటు ఆ … ) ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను..

Monday, September 10, 2007

ఎందరో మహానుభావులు – 2

పోయిన వారం హరికధా పితామహుడైన “ఆదిభట్ల నారాయణ దాసు గారి” గురించి తెలుసుకున్నాం కదా, ఈ వారం ఒక విప్లవకారుని గురించి తెలుసుకుందాం..

విప్లవకారుడంటే, ఎర్రజండా పట్టుకుని, ఇష్టం వచ్చినట్లు బందులు చేసి, అడ్డగించిన వాళ్ళని మందు పాతరలు పెట్టి పేల్చేసి, తామేదో మంచి చేస్తున్నామనే భ్రమలో, అందరినీ ఇబ్బందులు పెట్టేవారి కోవకి చెందరు ఇప్పుడు మనం చెప్పుకోబోయేవారు.. ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదా ఆయన మరెవరో కాదు, సంగీత సాహిత్యాలలో సంఘ సంస్కర్తగా, విప్లవకారుడిగా పేరు పొందిన “శ్రీ దాసు శ్రీరాములు”..

మాములుగా కళాకారులంటే, వాళ్ళు ఐహిక సుఖాల గురించి ఆలోచించరు.. తిండికి లేకపోయినా కళని వదులుకోలేరు.. వాళ్ళని ఎంత హింసించినా, పల్లెత్తు మాట అనరు.. ఎందుకంటే వాళ్ళు అంత సున్నిత మనస్కులు… కానీ అందరూ ఒకేలా ఉండరు కదా.. మంచి కోసం తిరగబడే వారు కూడ ఉన్నారు.. అలాంటివారి కోవలోకే వస్తారు శ్రీరాములు గారు..

ఈయన 1864వ సంవత్సరం లో జన్మించారు.. నూజివీడు ప్రభువుల సహకారంతో, అటు చదువుని, ఇటు సంగీత సాహిత్యాలని రెండూ ఔపోసన పట్టారు..

చదువుకున్న చదువు నిరర్ధకం కాకూడదని, న్యాయవాద వృత్తి చేపట్టారు.. ఇక సంగీత సాహిత్యాలు ఆయన తన ప్రవృత్తిగా మలచుకున్నారు.. ఎన్నో జావళీలు, మరెన్నో కృతులు వ్రాశారు.. వాటిల్లో ప్రముఖమైనవి “అభినయ దర్పణం”, "జావళీలు, పదాలు”.. ఈయన ప్రవృత్తి చూసి చాలామంది ఎందుకండీ ఈ పనికి రాని కళలు వీటితో ఏమి లాభం ఉంటుంది..వాటి గురించి సమయం వృధా చేసుకునే బదులు, ఇంకో రెండు కేసులు వాదించి, నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు కదా అనే వారు.. కానీ దాసు గారు వాళ్ళ మాటలని పట్టించుకునేవారు కాదు..

దేవుని దయ వలన, న్యాయవాద వృత్తి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంది.. అప్పట్లో ఏలూరులో ఆయన పేరు చెబితే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో...! సరే మధ్య మధ్యలో, సంగీత సభలు, ఎక్కడెక్కడి విద్వాంసులని పిలిపించి వాళ్ళ కచేరీలు పెట్టించడం, గొప్ప గొప్ప వారిని సత్కరించడం.. ఇలా హాయిగా సాగుతోంది.. అందులో చేసేది లాయరు, డబ్బుకి కూడా లోటు ఉండేది కాదు.. అందుకే ప్రవృత్తి కూడా నిరాఘాటంగా సాగిపోతూ ఉండేది…

అలాంటి సమయంలో, ఆయనకి ఒక సందేహం కలిగింది. అటు సంగీతంలో చూసినా, ఇటు సాహిత్యంలో చూసినా, ఏ భాషలో చూసినా, ఏ కళలో చూసినా, అందరూ పురుషులే.. సకల కళలకి తల్లి ఆ సరస్వతీ దేవి కదా కానీ స్త్రీలు కనిపించడంలేదెందుకు.. అలా పడ్డ బీజం వటవృక్షం లాగా మనసులో నాటుకు పోయింది.. అంతే ఆలోచన వచ్చిందే తడవుగా స్త్రీల కోసం ఏకంగా ఒక సంగీత పాఠశాలనే ఏర్పాటు చేశారు…

ఇక ఊరువాడ, సంగీత పాఠశాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు.. సరే నిర్ణయించిన ముహుర్తం రానే వచ్చింది… ఆ రోజే పాఠశాల ప్రారంభోత్సవం.. ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ లేరు.. సంప్రదాయవాదులంతా, హవ్వ ఆడపిల్లలకి సంగీతమేంటి, చోద్యం కాకపోతేనూ, అని బుగ్గలు నొక్కుకున్నారు..అంతే కాక తమ వాళ్ళెవరూ అటు వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని ఆంక్షలు పెట్టారు.. పేదవారేమో. మనకెందుకు ఈ పాటలు పద్యాలు అని వారు మిన్నకుండి పోయారు.. ఇక ఎటు కానీ మధ్యస్థులేమో, ఎటు పోయి ఎటు వస్తుందో, మనకెందుకు వచ్చిన బాధ అని ఊరకుండిపోయారు..

ముహుర్త సమయం దగ్గర పడుతోంది.. ఒక్కరంటే ఒక్కరు కూడ రాలేదు, శ్రీరాములు గారు చాలా బాధ పడ్డారు.. ఇదేమిటి స్త్రీలు సంగీతం నేర్చుకోవడం తప్పా.. అందరూ ఆదిశక్తి గా అమ్మవారిని పూజిస్తారే, అలాంటి శక్తి స్వరూపిణి ఐన ఆడది సంగీతం నేర్చుకోకూడదా.. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు ఉంటారు అని అంటారు కదా.. మరి వాస్తవంలో ఇలా ఉందేమిటి.. అంటే కేవలం చెప్పడానికి తప్ప ఆచరణలో పనికి రాదా.. ఇలా పరిపరి విధాల పోయింది ఆయన మనసు.. ఈ బూజు పట్టిన సిధ్ధాంతాలని పారద్రోలాలని గట్టిగా నిశ్చయించుకున్నారు.. ఇక అంతే ఎవరు రాకపోయిన తన కూతురు శారదాంబ తోనే, ఈ యజ్ఞానికి అంకురార్పణ చేశారు.. అలా మొదలు పెట్టి పెట్టిగానే, ఇద్దరు పిల్లలు భయం భయం గా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చారు.. వాళ్ళని చూడగానే దాసు గారు ఉప్పొంగిపోయారు.. వాళ్ళ పేర్లు అడిగారు.. దానికి వాళ్ళు మేము దేవదాసీలమండీ, అని సగం లో ఆపేశారు.. దానికి శ్రీరాములు గారు అలా అనకండీ సంగీతానికి కుల, మత, జాతి, వర్గ విబేధాలు లేవు.. ఈ రోజు నుండి, మన కులం సంగీతం.. మిగతవన్నీ మరచిపోండి అన్నారు.. తనే వాళ్ళకి ఆది గురువై సాధన ప్రారంభించారు.. ఆ రోజుల్లో సంగీత, నృత్యాలని కేవలం దేవదాసీలు తప్ప వేరేవాళ్ళెవరూ నేర్చుకునే వారు కాదు.. కానీ శ్రీరాములు గారి ప్రయత్నం వల్ల చిన్నగా కుటుంబ స్త్రీలు, సంప్రదాయవాదులు రావడం మొదలుపెట్టారు..

నేడు ఇంతమంది, “పాడాలని ఉంది”, “సై”, “సరిగమప” లాంటి పోటీలలో కనిపిస్తున్నారంటే అది కేవలం దాసు శ్రీరాములు గారి చలవే.. తను అనుకున్నది సాధించి ఎందరికో మార్గదర్శకులైన శ్రీరాములు గారు సంగీత సాహిత్యాలలో విప్లవకారుడు కాదంటారా..

Friday, September 7, 2007

రామునికి సీత ఏమవుతుంది…?

రామునికి సీత ఏమవుతుంది…? ఈ ప్రశ్న ఎవరైనా అడిగితే వాళ్ళకేమి తెలియదు, వాళ్ళు వట్టి మూర్ఖులు అని మనలో చాలామందికి సాధారణం గా ఉన్న అభిప్రాయం.. నిజం చెప్పాలంటే నేను కూడ ఒక రెండు మూడు నెలల క్రితం వరకు ఇదే అభిప్రాయం తో ఉండేదాన్ని.. ఐతే అప్పుడు అనుకోకుండా ఆరుద్ర గారు రాసిన “రాముడికి కి సీత ఏమవుతుంది” అనే పుస్తకం చడవడం జరిగింది.. దాంట్లో ఉన్న విషయాలన్నీ ఏకీభవించలేకపోయినా, చరిత్రలో ఇన్ని రామాయణాలు ఉన్నాయా, మనకి తెలియకుండా చరిత్రని ఇంత మార్చేశారా అని అనిపిస్తుంది…!

మనకి వాల్మీకి, రాసిన “శ్రీ మద్రాంధ్ర రామాయణం” మూల విరాట్టు.. కానీ వాల్మీకి రామాయణం రాయడం మొదలు పెట్టకముందే చాలా రామాయణ గాధలు ప్రాచుర్యం లో ఉన్నాయి.. వాటిల్లో చాలా పేరెన్నిక గన్నవి “జైన, బౌధ్ధ రామాయణాలు”..

ముందుగా బౌధ్ధ రామాయణం లో ఉన్న కధలని తెలుసుకుందాం.. బౌధ్ధ రామాయణం లోని రెండు కధలకి, మన రామాయణం కి చాలా పోలికలు కనిపిస్తాయి.. అవి (1) పేరు తెలియని రాజు కధ (2) దశరధ జాతకం
మొదటిగా పేరు తెలియని రాజు కధని గురించి తెలుసుకుందాం..

పేరు తెలియని రాజు కధ:

బుధ్ధుడి పూర్వజన్మలోని కధ ఇది.. ఆ జన్మలో పేరు తెలియదు అందుకే కధ పేరు “పేరు తెలియని రాజు కధ”.. మనం చెప్పుకోవడానికి వీలుగా, ఆ రాజు పేరు బోధిసత్వుడు అని అనుకుందాం.. రాజు అన్నాక రాణి కూడా ఉంటుంది కదా.. సరే బోధిసత్వుడు అలవాటు ప్రకారం జనరంజకం గా పరిపాలిస్తూ ఉంటాడు.. ఐతే ఈయన రాజ్యం ప్రక్కనే బోధిసత్వుడి మేనమామ కూడా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు.. ఈయన మహా క్రూరుడు, దురాశాపరుడు.. అత్యాశతో, బోధిసత్వుడి రాజ్యాన్ని కూడా తన రాజ్యంలో కలిపేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.. అసలే బోధిసత్వుడు అహింసా పరుడు.. అందుకని, ఈ గొడవలు పడలేక, యుధ్ధాలు చేయలేక రాజ్యాన్ని మంత్రులకి అప్పగించి, తన రాణి ని తీసుకుని అడవులకి వెళ్ళిపోతాడు.. (కధ ఇలా సాగితే మన తెలుగు వాళ్ళకి అసలు నచ్చదు.. హీరో ప్లేస్ లో ఎవరున్నా ఫైటింగ్ చేయాలి తప్ప, ఇలా ప్రశాంతం గా గడపకూడదు…!)

అదే అడవిలో దుష్టుడైన ఒక నాగుగు ఉన్నడు.. (విలన్ ఎంట్రీ) రాణి అందచందాలు చూసి ఆమెని ఎలాగైనా తనదాన్ని చేసుకోవాలనే దుర్బుద్దితో, మాయా వేషదారియై (ముని వేషం లో) బోధిసత్వుని కి ఉపచారాలు చేస్తూ ఉంటాడు.. ఒకరోజు, బోధిసత్వుడు ఏదో పని మీద, బయటకు వెళ్ళగా, ఆదను చూసి ఆ నాగుడు రాణి ని బలవంతంగా తన తో తీసుకువెళతాడు.. మార్గ మధ్యంలో, పెద్ద పెద్ద రెక్కలున్న ఒక పక్షి అడ్డగిస్తుంది కానీ దాన్ని అశక్తురాలిని చేసి రాణిని తనతో, తీసుకువెళ్ళిపోతాడు ఆ నాగుడు..

ఇక్కడ ఏమో ఆశ్రమానికి తిరిగి వచ్చిన బోధిసత్వుడికి రాణి జాడ కనపడకపోవడం తో, తనని అన్వేషిస్తూ బయలుదేరతాడు.. అలా వెళ్తూ ఉండగా, ఒకచోట దు ంఖ సాగరం లో మునిగి ఉన్న వానరుడు కనిపిస్తాడు.. బోధిసత్వుడు అతనిని సమీపించి, ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడుగుతాడు.. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ వానరుడి మేనమామ అతని రాజ్యాన్ని అన్యాయంగా అనుభవిస్తూ ఉంటాడు.. షరా మామూలుగా మన హీరో బోధిసత్వుడు సపోర్టింగ్ యాక్టర్ కి తన వంతు సహకారం అందిస్తాడు.. హీరో ప్రక్కన ఉన్నవాళ్ళదే గెలుపు కాబట్టి, వానరుడు తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు.. వానరుడు తన వంతు సహాయం గా, బోధిసత్వుడి రాణిని వెతకడానికి తన వానర సైన్యాన్ని పంపిస్తాడు.. ఆ వానరులు రాణి గురించి వెతుకుతూ ఉండగా, మధ్యలో రెక్కలు తెగి కొన ఊపిరితో పడి ఉన్న పక్షి కనిపిస్తుంది.. దాని ద్వారా, రాణిని నాగుడు ఎత్తుకుపోయి, సముద్రం కి ఆవల ఉన్న ఒక లంక లో దచిపెట్టడని తెలుస్తుంది.. ఇవన్నీ తెలుసుకున్న బోధిసత్వుడు, వానర సైన్యం సహాయంతో, సముద్రం మీద వారధి కట్టి, ఆ నాగుడిని జయించి రాణిని విడిపించుకుని తీసుకు వస్తాడు.. ఇది అంతా అయ్యేసరికి, బోధిసత్వుడి మేనమామ, అనారోగ్యంతో మరణిస్తాడు.. దాంతో వానరులు వాళ్ళ రాజ్యానికి, బోధిసత్వుడు తన రాజ్యానికి చేరుకుంటారు..

అక్కడితో కధ అయిపోలేదు.. ఇంకా కొంచెం ఉంది.. బోధిసత్వుడు తన భార్యతో, నువ్వు ఇంత కాలం నా దగ్గర లేవు కదా.. ప్రజలు నిన్ను అనుమానిస్తారు అంటాడు.. దానికి ఆవిడ నేను కనుక పవిత్రురాలిని ఐతే, ఈ భూమి రెండు గా చీలిపోతుంది అని అంటుంది.. ఎంతైనా ఆవిడ పవిత్రురాలు కాబట్టి భూమి చీలిపోతుంది.. దాంతో బోధిసత్వుడు తిరిగి ఆమెని చేపడతాడు.. ఇక తరువాత తన రాజ్యాన్ని ప్రజారంజకం గా పరిపాలిస్తాడు..


ఇదీ స్థూలంగా “పేరు తెలియని రాజు కధ”….. పెధ్ధ పరెశీలించనవసరం లేకుండానే, మన రామాయణానికి దీనికి చాలా పోలికలు కనిపిస్తాయి….

ఉదాహరణకి, వాల్మీకి రామాయణం లో, సవతి తల్లి వల్ల వనవాసానికి వెళితే, బౌధ్ధ రామాయణం లో, మేనమామ ఆగడాలు భరించలేక వెళ్తాడు..

దాంట్లో, రావణుడు సీతని అపహరిస్తే, దీంట్లో నాగుడు అపహరిస్తాడు.. ఇంకో పొలిక కూడ ఉంది.. ఇద్దరూ ముని వేషం లోనే వస్తారు…

రెండిటిలోనూ, వానర సైన్యం సహాయంతోనే, సముద్రం మీద సేతువుని కడతారు..

రాముడు, బోధిసత్వుడు ఇద్దరూ తమ తమ రాణులని అనుమానిస్తారు… అగ్నిలోకి దూకమని ఒకరంటే, భూమిని చీల్చమని మరొకరంటారు…

మిగిలిన రెండో కధను తరువాత చూద్దాం..

Wednesday, September 5, 2007

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు


అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.. మనం ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి 119వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం..

మన సంస్కృతిలో, గురువుకి, చాలా గొప్ప స్థానం ఉంది.. అందుకే, తల్లిదండ్రుల తరువాత అంతటి వారుగా గురువుని కీర్తించారు పెద్దలు..

మాతృ దేవోభవ,
పితృ దేవోభవ,
ఆచార్య దేవోభవ…

మనం పుట్టినప్పటినుండి, జీవితం లో స్థిరపడే వరకు ప్రతి దశలోనూ, ఉపాధ్యాయుడి ముద్ర ఎంతైనా ఉంది.. “అ ఆ ల నుండి, ఆర్కుట్ వరకు”, “భయభక్తుల నుండి బ్లాగు”ల వరకు ఉన్న ఈ ప్రస్థానం లో, ప్రతి అడుగు చేయి పట్టుకుని మనల్ని నడిపించింది మన గురువులే…

ప్రాచీన కాలం లో, గురుకులాలు ఉండేవి.. గురువుకి శుశ్రూష చేస్తూ విద్యాభ్యాసం సాగించేవాళ్ళు…. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి వాళ్ళు కూడా, గురువులకి సేవ చేసి చదువుకున్నవారే…

ఇప్పుడు విద్యావిధానం చాలా మారిపోయింది.. అయినప్పటికీ, గురువుల పాత్ర ఏమి తగ్గలేదు సరికదా ఇంకా ఎక్కువైంది.. అంతకుముందు, అయిదేళ్ళ వయసులో బడిలో చేరిస్తే, ఇప్పుడు రెండేళ్ళకో, మూడేళ్ళకో చేరుస్తున్నారు.. దాంతో, ఇంకా ఎక్కువ శ్రధ్ధ పెట్టాల్సి వస్తోంది…

ఒక ఇంజనీర్, ఒక్క ఇంజనీరుని కూడా తయారు చేయలేడు, ఒక డాక్టర్ మహా అయితే ఇంకో డాక్టర్ ని తయారు చేస్తాడేమో.. కానీ కేవలం ఒక టీచర్ మాత్రమే, ఎంతో మంది డాక్టర్లని, మరెంతో మంది ఇంజనీర్లని, తనలాంటి టీచర్స్ ని తయారు చేయగలడు..అందుకేనేమో వేదాలలో, గురువుని దేవుడి కన్నా అర్ఘ్యతాంబూలం ఇచ్చారు…
గురు బ్రహ్మః
గురు విష్ణుః
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మః
తస్మైశ్రీ గురవే నమః

అసలు ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఎలా మొదలయింది అనేదానికి ఒక చిన్న కధ ఉంది.. సర్వేపల్లి గారు జీవించి ఉన్న సమయంలో, కొంతమంది విద్యార్ధులు, స్నేహితులు కలిసి ఆయన పుట్టినరోజుని వేడుకగా చేద్దామని అంటే, దానికి ఆయన నా పుట్టినరోజుకంటే కూడా దాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా చేస్తే సంతోషిస్తాను అని అన్నారట.. దాంతో ఈ గురు పూజ్యోత్సవం మొదలయింది.

తల్లి లేదా, తండ్రి తప్పు చేస్తే కేవలం ఆ కుటుంబం మాత్రమే నష్టపోతుంది.. కానీ అదే ఒక గురువు తప్పు చేస్తే, ఆయన విద్యార్ధులందరూ నష్టపోతారు..


మనం ఈ రోజు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, మనకి చదువు చెప్పి మన ఉన్నతికి సహాయపడిన గురువులని మర్చిపోలేము.. అందుకేనేమో, ఒకసారి సుధామూర్తి గారు (ఇన్ఫోసిస్) అంటారు.. నేను ఇంత బాగా కధలు చెప్పడానికి, పిల్లల ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలుగుతున్నాను అంటే అది కేవలం మా టీచర్ “గౌరమ్మ గారి” చలవే అని.. అలాన మన మాజీ రాష్ట్రపతి “అబ్దుల్ కలాం గారు” ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన వీణ నేర్చుకున్న టీచర్ గారిని వేదిక మీదకి పిలిపించి సన్మానించారు…

అందుకే ఎంత ధనవంతులైనా, గొప్పవారైనా, గురువులకి శిరస్సు వంచి నమస్కారం చేస్తారు.. ఇప్పటికీ పల్లెటూళ్ళలో, టీచర్స్ ని చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు…

మన ఉన్నతికి పాటుపడి, మనల్ని ఈ స్థాయికి చేర్చిన గురువులని ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం.. మరొక్కసారి గురువులందరికీ “గురుపూజ్యోత్సవ శుభాకాంక్షలు”…

Monday, September 3, 2007

ఎందరో మహానుభావులు – 1




మన తెలుగు నేలకి, తెలుగు వారికే సొంతమైన కళారూపాలు ఎన్నో ఉన్నాయి.. ఉదాహరణకి “హరికధ”, “కూచిపూడి”, “పద్యాలు”.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి… అలానే తెలుగు వైభవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు…. అలాంటివారిలో ముందుగా హరికధా పితామహుడైన “అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు” గారి గురించి తెలుసుకుందాం..

కాకతాళీయంగా, నేను ఇది వ్రాయడం మొదలుపెట్టిన రోజునే, ఆ మహానుభావుడి జన్మదినం (ఆగష్ట్ 31).. ముందుగా ఆయనకి శతకోటి వందనాలు…

నారాయణ దాసు గారు 1864, ఆగష్ట్31వ తేదీన అజ్జాడ అనే గ్రామంలో జన్మించారు.. కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలన్నీ చెప్పేవారట.. ఒకసారి వారి అమ్మగారు దాసు గారిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళారట.. అక్కడ పుస్తకాల కొట్టులో, భాగవతం చూసిన ఆయన అది కావాలి అని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని, భాగవతం నీకేమి అర్ధమవుతుంది అన్నారట.. అంతే దాసు గారు ఆపకుండా భాగవతం లోని శ్లోకాలన్నీ గడగడా చెప్పేశారట.. అది చూసి అతను ఆనందంగా దాసు గారిని ఎత్తుకుని ఆ పుస్తకం తో పాటు, కొంత దక్షిణ కూడ ఇచ్చి పంపించారు…

ఇది ఇలా ఉండగా, ఒకసారి దాసు గారు వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం జరిగింది.. అక్కడ అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే, అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి, తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పారట.. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది.. ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం… ఇలా రెంటినీ ఎంతో నేర్పుగా సంభాళించగలిగారు దాసు గారు…


ఐతే ఈయనకే ప్రత్యేకమైన “హరికధ”ని వెలుగులోకి తెచ్చింది మాత్రం “జయంతి రామదాసు”గారు.. ఆయన ప్రోద్భలంతో, మొదటి హరికధా కాలక్షేపానికి రంగం సిధ్ధమైంది… మొదటిది రాజముండ్రి లో ఏర్పాటు చేశారు.. ఇప్పటిలా కరెంటు లేదు.. మైకులు, సౌండ్ బాక్స్ లు లేవు.. ఉన్నదల్లా, ఇసుక వేస్తే రాలనంత జనం, మధ్యలో వేదిక మీద నారాయణ దాసు గారు… అంతే ఉన్నట్లుంది మ్రోగింది కంచు కంఠం .. ఊరంతా ఉలిక్కిపడింది..గంభీరమైన ఆకారం, ఒక చేతిలో చిడతలు, కాళ్ళకి గజ్జెలు.. అలా మొదటి హరికధ కి అంకురార్పణ జరిగింది…

ఇక ఆ తరువాత నారాయణ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు… ఆయన ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది.. మైసూర్ మహారాజు గారి నుండి, ఆహ్వానం అందింది.. రాజా వారు, హరికధకి ముగ్ధులైపోయారు.. దీనితో పాటు, వీణాగానం కూడ అడిగి మరీ విన్నారు…. ఇక ఆయన ఇచ్చిన బహుమతులకి ఐతే లెక్కే లేదు…

ఇక ప్రిన్స్ ఛార్మింగ్ గా పేరుపొందిన ఆనంద గజపతి గారు ఐతే చెప్పక్కర్లేదు… ఏకంగా నారాయణ దాసు గారిని ఆస్థాన విద్వాంసులుగా నియమించారు… ఒకసారి సభలో ఆయన దాసు గారిని ఏదో రాగం పాడమని అడిగారట కానీ ఆయన నేను పాడను అని సభలో నుండి వెళ్ళిపోయారట.. రాజు గారు కూడా దానికి ఏమి కోపం తెచ్చుకోలేదు… ఐతే తరువాత ఆయన వ్యాయామశాలలో వ్యాయామం చేస్తున్నప్పుడు, ఎందుకో ఆ రాగం గుర్తు వచ్చి, పాడడం మొదలుపెట్టారట… నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి… చుట్టూతా జనాలు ఉన్నారు.. కానీ ఆయన ఇవేవి పట్టించుకొనే స్థితిలో లేరు… చివరికి పాడడం ఐనతరువాత చూసుకుంటే ఒంటి మీద కేవలం గోచీ తప్ప ఏది లేదట.. ఆ రాగం విన్న ప్రజలంతా ఆనందంతో ఇంటికి వెళ్ళిపొయారు… వెళ్ళిపోయిన ఆ జనంలో, ఆనంద గజపతుల వారు కూడ ఉన్నారట…!


ఆయన కేవలం హరికధ తోనే, ఆగిపోలేదు.. సంగీత సాహిత్యాలలో అష్టావధానం చేసేవారు… వీణ, వయొలిన్, ఇలా ఒకటేమిటి ఏదైనా దాసు గారి చేయి పడిందంటే దాని అంతు చూడలసిందే… ఆయన ఎన్నో పుస్తకాలు కూడా రచించారు… ఆయన ఒమర్ ఖయ్యూమ్ గారు వ్రాసిన కవితలని, తెలుగులోకి, సంస్కృతంలోకి అనువదించారు… ఈ అనువాదం అప్పటిలో చాలా గొప్ప గ్రంధంగా పేరు పొందింది… అంతే కాదు, నారాయణ దాసు గారు, ప్రఖ్యాతి చెందిన “శ్రీ విజయరామ గాన పాఠశాల”కి ప్రప్రధమ ప్రధానోపాధ్యాయులుగా చేశారు..

ఆయన ప్రజ్ఞా పాటవాలకి ఎన్నో బిరుదులు, మరెన్నో పురస్కారాలు… వాటిలొ మచ్చుకి “సంగీత సాహిత్య సార్వభౌమ”, “పంచముఖి పరమేశ్వర”, “లయబ్రహ్మ”… ఈయన సకల కళా నైపుణ్యానికి ముచ్చటపడిన బ్రిటీష్ వారు ఆయనని నోబుల్ పురస్కారానికి నామినేట్ చేద్దామనుకున్నారట.. కానీ నారయణ దాసు గారు ఒప్పుకోలేదట.. దానివల్ల ఆయనకి ఏ నష్టం లేకపోయినా, హరికధ మాత్రం చాలా నష్టపోయింది…

తన జీవితం మొత్తం, తను జన్మించిన తెలుగు గడ్డకి తన వంతు సేవ చేసి, 1945, జనవరి2వ తేదీన ఆ దేవ దేవునిలో ఐక్యం అయినారు…