Monday, October 8, 2007

ఎందరో మహానుభావులు – 5

మనకి ఇప్పుడు భజన మండలి అంటే సుపరిచితం.. తిరుమలలో, బ్రహ్మోత్సవాల సమయంలో, వాళ్ళు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. నేడు తెలుగు నాట, భజన మండలి లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో…!

మామూలుగా ఒక్కళ్ళు పాడాలంటే, గొంతు మృదు మధురంగా ఉండాలి కానీ అందరికీ అంత్ర శ్రావ్యమైన కంఠం ఉండదు కదా, అయితే ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక మూల పాడాలనే ఉంటుంది.. భజన బృందం అయితే, అందరితో కలిసి మనసారా పాడచ్చు.. అలాంటి భజన పాటలని మన ఆంధ్ర దేశంలో మొట్టమొదట వ్రాసిన ఘనత “పలుకూరి వెంకట రమణ” గారికి చెందుతుంది..

పలుకూరి వారింట 1900వ సంవత్సరంలో, మంగమాంబ, వెంకటరామార్యులకి ఒక పిల్లాడు జన్మించాడు..ఆ పిల్లాడికి, తమ కులదైవమైన వెంకటరమణుడి పేరు పెట్టారు.. అయితే ఎందుచేతనో, అందరి పిల్లల్లా అతనికి మాట రాలేదు.. అది చూసి తల్లడిల్లారు తల్లిదండ్రులు, ఆ వెంకటేశ్వరునికి మొక్కుకున్నారు, ఎట్టకేలకి మాట వచ్చింది. కానీ వాళ్ళ ఆనందం ఆవిరవడానికి ఎంతో కాలం పట్టలేదు.. ఒక ప్రక్క ఏళ్ళు వస్తున్నా, తెలివితేటలు లేవు, మందబుధ్ధి.. ప్రొద్దున్నే లేచి ఇంత తిని, బయటకి వెళ్ళి మళ్ళీ ఎప్పటికో ఇల్లు చేరేవాడు.. పెద్దైన తరువాత కూడా, తల్లి తినిపించి, జోల పాడితే తప్ప నిద్ర పోయేవాడు కాదు.. ఇక స్నానం చేయించి బట్టలు కట్టేది తండ్రి.. అతను ఏమి చేస్తున్నాడో, ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్ధం కాక, బెంగపడ్డారు ఇంట్లో వాళ్ళు..


ఎవరికి ఏమి రాసిపెట్టుందో, అది జరగే వరకూ తెలియదు కదా.. అప్పటి వరకు వేచి చూడడమే.. ఒకానొక సందర్భంలో, అతని తండ్రి అబ్బాయిని ఆదిభట్ల నారాయణ దాసు(హరికధా పితామహుడు) గారికి పరిచయం చేశాడు.. ఆయన వెంకట రమణని పై నుండి క్రింద వరకు చూసి, వీడు ఎప్పటికైనా పేరు తెచ్చుకుంటాడు అని అన్నారట.. అంతే కాకుండా, ఆ శ్రీనివాసుని గుడి చుట్టూ, పొర్లుదండాలు పెట్టించమని చెప్పారట.. సరే ఏ పుట్టలో, ఏ పాముందో, ఇది కూడా ప్రయత్నిద్దాం అని పెట్టిస్తున్నాడు తండ్రి.. ప్రదక్షిణలు చేస్తున్నాడు వెంకట రమణ.. ఆ వెంకట రమణుడి చుట్టూ, ఈ వెంకట రమణుడు తిరుగుతున్నాడు, తన చుట్టూ తానే తిరుగుతున్నాడు.. ఆత్మ ప్రదక్షిణలు చేస్తున్నాడు.. ప్రదక్షిణలు చేసీ చేసీ సొలసి పోయాడు వెంకట రమణ.. కాసేపటికి లేచి, చిన్నగా రాగాలాపన ఆరంభించాడు.. ఆ రాగం మెల్లగా పాట లాగా మారింది.. అక్కడున్న వారందరూ ఆ లీలా మానుషుడి లీలకి ఆశ్చర్యపోతున్నారు.. ఆ దేవుడి దయ వలన ఎటువంటి అభ్యాసం లేకుండానే, సంగీతం వచ్చేసింది వెంకట రమణ కి.. పాట తేనెలా జాలువారింది.. ఇంటి పేరైన పలుకూరిని సార్ధకం చేశాడు.. ఈయన వ్రాసిన కృతులని నారాయణ దాసు గారు, బొట్టు విశ్వనాధ శాస్త్రి గారూ పరిశీలించి, కొన్నిటిని సరిద్ది ఎంతగానో ప్రోత్సహించారు.. ఈ కీర్తనలన్నిటినీ పుస్తకంగా అచ్చేయించి అందరికీ పంచి పెట్టారు వెంకట రమణ గారు..

పాతికేళ్ళ వరకూ, తనేమి చేస్తున్నాడో తనకే తెలియని స్థితి నుండి, ఈనాడు ఇంతమంది జనులకి భక్తి సాగరంలో ఓలలాడించగలగడం, అంతా ఆ జగన్నాటక సూత్రధారి లీలా వైశిష్ట్యం.. ఏదైతేనేమి, మన తెలుగు వాళ్ళకి భజన పాటలు పాడుకోవడానికి ఒక మార్గదర్శకుడు లభించాడు..

3 comments:

Burri said...

మేధ గారు,
చాలా విలువైన విషయం రాసినారు. మీకు నా నెనర్లు.
-మరమరాలు

విహారి(KBL) said...

చాలా బాగుంది.

మేధ said...

@మరమరాలు గారు, @విహారి గారు నెనర్లండీ...