Monday, October 1, 2007

వేలెత్తి చూపడం

మొన్న శనివారం ఈనాడులో వచ్చిన “మనసులో మాట” చదివాను (అది ఇక్కడ చదవండి) మొదట అతనంటే జాలి వేసింది.. తరువాత అతని మీద చాలా కోపం వచ్చింది.. అతను అలా అవడానికి ఆమె ఎంత కారణమో, అతను కూడా అంతే కారణం.. కానీ అదంతా వదిలేసి కేవలం ఆవిడనే వేలెత్తి చూపడం ఏమీ బాలేదు..

ఈ కధలో ఉన్నతనే కాదు, మనలో చాలా మంది మన తప్పులకి ఎదుటి వారిని కారణంగా చూపిస్తూ ఉంటారు.. అసలు ఈ భావం చిన్నప్పటి నుండే మొదలవుతుంది..! బడిలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే అబ్బాయి, ఈ సారి అది వేరే వాళ్ళకి వస్తే, తనకి రాకపోవడానికి కారణం ఆ అబ్బాయికి రావడం వలన అనుకుంటాడు తప్ప, తను సరిగ్గా చదవకపోవడం వలన అనుకోడు.. అదుగో అప్పుడు అలా మొదలవుతుంది ఈ బ్లేమ్ గేమ్.. కానీ వాళ్ళకి ఆ వయసులో దాని గురించి తెలియదు కూడా.. కొంతమంది దాన్ని ఒక సవాల్ గా తీసుకుని ఎదగడానికి ప్రయత్నిస్తారు.. ఇలాంటి వాళ్ళతో ఏమీ ఇబ్బంది ఉండదు.. కానీ కొంతమందుంటారు.. వాళ్ళేమీ సాధించలేకపోయినా ప్రక్క వాళ్ళ వల్లే రాలేదనుకుంటారు తప్పితే వాళ్ళలోని లోటుపాట్లు తెలుసుకోరు..

అయితే ఇలా, వేరే వాళ్ళని అనుకోవడం శృతి మించనంత వరకూ బానే ఉంటుంది.. దాని వల్ల వాళ్ళు కూడా పైకి ఎదగడానికి ఉపయోగపడుతుంది.. అయితే ఇది కనుక ముదిరి పాకాన పడితే మాత్రం వాళ్ళకే కాక, వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది.. ఇక వాళ్ళకి ఏమి జరగకపోయినా ఎదుటి వాళ్ళ వల్లే ఇలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు..

ఇలాంటి వాళ్ళలో చాలా రకాల వాళ్ళు ఉంటారు.. వీళ్ళ గురించి చర్చించే ముందు వాసు సినిమాలో ఒక సీన్ చెబుతాను.. వెంకటేష్ కి భూమిక అంటే ఇష్టం.. ఆమె దృష్టిలో పడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.. అయితే ఏదీ పని చేయదు.. ఈ సంఘటనలన్నీ వాళ్ళ స్నేహితులతో చెబుతూ ఉంటాడు.. అవన్నీ విని వాళ్ళకి బాగా నవ్వొస్తుంది.. పగలబడి నవ్వుతుంటారు.. అప్పుడు వెంకటేష్ అంటాడు.. ఏంటిరా, జోకర్ లాగా కనిపిస్తున్నానా అని.. దాంతో నవ్వడం ఆపేస్తారు.. మళ్ళీ వెంకటేష్ అంటాడు ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను.. నాకెన్ని ఆశలు, ఆశయాలు.. కానీ అంతా ఆ అమ్మాయి వల్ల అంటాడు..

ఇలాంటి వాళ్ళు మన నిజ జీవితంలో చాలామంది ఎదురుపడుతుంటారు.. బాగానే చదువుతూ ఉండే అబ్బాయికి ఒక శుభముహుర్తాన(తరువాత అదే అత్యంత దుర్ముహుర్తం లాగా అనిపిస్తుంది..!) ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు.. ఆ తరువాత కధ తెలిసిందే.. అలా చదువు అటకెక్కుతుంది(అందరి విషయం లో కాదు.. కొంతమంది కి మాత్రమే) తరువాత ఇద్దరూ స్థిరపడితే ఏ ఇబ్బంది లేదు.. లేక ఇద్దరూ స్థిరపడకపోయిన ఏమీ ఇబ్బంది ఉండదు.. ఒకవేళ అబ్బాయి సెటిల్ అయి అమ్మాయి అవకపోయినా అమ్మాయి ఏమీ అనుకోదు.. అదే అమ్మాయి స్థిరపడి అబ్బాయి కాకపోతే మాత్రం పరిస్థితి చాలా దారుణం గా ఉంటుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య కురుక్షేత్రమే.. అది ఎంతవరకూ దారి తీయచ్చంటే చివరికి విడిపోవడం కూడా జరుగుతుంది.. కాస్తన్నా ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళైతే, సరే జరిగిందేదో జరిగింది.. ఇకనైనా నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అనుకుంటారు.. కానీ కొంతమంది ఉంటారు.. అవతలి వాళ్ళు తమని మోసం చేశారని, వాళ్ళ వలనే తాము ఇలా అయ్యామని, వాళ్ళే లేకపోతే తాము ఇప్పటికి ఎలా ఉండే వాళ్ళమో అని అనుకుంటూ కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంటారు.. దాని వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో మానసిక క్షోభ.. వీళ్ళు ఆ సంగతి పట్టించుకోరు.. ఆ అమ్మాయిని తప్పుబడుతూ ఉంటారు తప్ప వీళ్ళ తప్పులని ఎప్పటికీ తెలుసుకోరు, ఆ అమ్మాయి అంటే తనకున్న ఇష్టం వల్లే ఇంత జరిగింది అని ఎప్పటికీ తెలుసుకోరు.. తాము అపర మునీస్వరులమైనట్లు, ఆ అమ్మాయి తమని నాశనం చేసినట్లు అనుకుంటూ ఉంటారు తప్ప తాము చేసిన పనులు ఎప్పటికీ గుర్తు రావు.. ఇక వాళ్ళ జీవితం అంతే..

నేను ఒక కధలో చదివిన సంఘటన చెబుతాను.. అది ప్రస్తుత విషయానికి అతికినట్లు సరిపోతుంది.. ఒక ఊరిలో భార్య, భర్త నివసిస్తూ ఉంటారు.. వాళ్ళు పేదవాళ్ళైనా, కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకుంటారు.. అయితే అతని భాగస్వాములు అతన్ని నిలువునా ముంచేస్తారు, వీళ్ళు కట్టుబట్టలతో మిగులుతారు అయినా మళ్ళీ కష్టపడి పైకి వస్తారు.. ఈ సారి కన్నబిడ్డలు వెళ్ళగొడతారు, మళ్ళీ కట్టుబట్టలతో మిగులుతారు, అయినా వాళ్ళు నిరాశ చెందకుండా మళ్ళీ ప్రయత్నించి పూర్వ వైభవన్ని పొందుతారు.. అతని భార్య అన్ని దశల్లోనూ అతనితో పాటే ఉంటుంది.. ఈ సారి అతనికి తీవ్రమైన గుండెపోటు వస్తుంది.. ఆసుపత్రికి తీసుకువెళతారు.. ఆపరేషన్ పూర్తవుతుంది.. డాక్టర్ లు మరేమీ భయం లేదమ్మా, వెళ్ళి మీ భర్తని చూడండి అంటారు.. అలా నిస్తేజంగా బెడ్ మీద పడి ఉన్న అతన్ని చూసి ఆమెకి చాలా బాధ కలుగుతుంది.. ఇంతలో భర్త చిన్నగా కళ్ళు తెరుస్తాడు, ఆమెని చూసి ఒక జీవంలేని నవ్వు నవ్వి చిన్నగా మాట్లాడడం మొదలు పెడతాడు.. నువ్వు అన్ని కష్టాలలోను, నన్ను వెన్నంటే ఉన్నావు అని ఆపుతాడు.. దానికి ఆ భార్య ప్రేమతో అతని చేతులని తన చేతుల్లోకి తీసుకుంటుంది.. అప్పుడతనంటాడు నువ్వు నాతో ఉండడం వల్లే నాకిన్ని కష్టాలొస్తున్నాయేమో అని..!!!!

చూశారా ఎలాంటి వ్యక్తిత్వమో ఆ భర్తది… అతను అన్ని సార్లు నష్టపోవడానికి కారణం అతని అజాగ్రత్త, అతి నమ్మకం.. ఇదే వ్యక్తి తను బాగు పడినప్పుడు ఒక్కసారి కూడా భార్య వల్ల ఇవన్నీ వచ్చాయి అనలేదు.. ఈ కధలోనే కాదు ఇలాంటి వాళ్ళని మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం..వాళ్ళ కష్టాలన్నిటికీ ఎదుటి వాళ్ళని కారణంగా చూపించే వాళ్ళు తమ విజయానికి మాత్రం తామే కారణం అనుకుంటారు..

ఇప్పుడు ఇంకో రకం వాళ్ళని చూద్దాం.. నిజానికి వీళ్ళు మంచి వాళ్ళే.. తమ గురించి కూడా ఆలోచించుకోకుండా ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు.. అయితే తమకి ఇబ్బందులు వచ్చినప్పుడు వీళ్ళ ఆలోచనాధోరణి ఒక్కసారిగా మారిపోతుంది.. తాము ఎవరెవరికైతే సహాయం చేశామో వాళ్ళందరూ వచ్చి తమకి సహాయం చేయలనుకుంటారు.. అయితే మిగతా వాళ్ళు వాళ్ళంత మంచి వాళ్ళు కాకపోవచ్చు, ఒకవేళ చేయాలి అనుకున్నా పరిస్థితులు సహకరించకపోవచ్చు.. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళకి ఎంత చేశాను, వీళ్ళకి ఎంత చేశాను, ఇప్పుడు నన్ను ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటారు తప్పితే, తమ ఇబ్బందులని ఎలా బయటపడాలి అనే ఆలోచన మాత్రం కొంచెం కూడా ఉండదు..

ఇప్పుడు మరో రకం వాళ్ళు.. వీళ్ళకి బంధువులన్నా, స్నేహితులన్నా పడదు.. మనం ఈ విషయంలో వాళ్ళని తప్పుబట్టలేము.. ఎందుకంటే ఎవరి ఇష్టా ఇష్టాలు వాళ్ళకి ఉంటాయి.. సరే వీళ్ళ వాలకం చూసి, ఎవరూ వీళ్ళతో మాట్లాడరు.. అలా ఉన్నా కూడా మళ్ళీ తమని ఎవరూ పట్టించుకోవట్లేదని బాధే.. ఎవరన్నా పలకరించిపోదామని ఇంటికి వస్తే నచ్చదు.. అదే వ్యక్తి ఈ సారి ఆ ఊరి వచ్చినప్పుడు ఎందుకులే వెళ్ళడం, ఒకసారి జరిగింది చాలు అని వెళ్ళకుండా ఉంటే, తరువాత వాళ్ళు అక్కడికి వచ్చారని తెలిస్తే అగ్గి మీద గుగ్గిలమైపోతారు.. మా ఇంటికి ఎందుకు రాలేదని? స్వతహాగా, ఎవరితో కలవడం ఇష్టం లేని వాళ్ళు, ఎవరూ రానందుకు సంతోషించాలి అంతే కానీ, తమని ఎవరూ చూడట్లేదని ఏడుపు ఎందుకు..?! అవ్వా కావాలి, బువ్వ కావాలి అంటే దొరకవు కదా..

ఇవన్నీ ఎందుకు, చాలా మంది అనుకుంటూ ఉంటారు.. తాము కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని నిందిస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళే సుఖాల్లో ఉన్నప్పుడు అసలు దేవుడిని పట్టించుకోరు.. కేవలం తమ తెలివితేటల వలన, శక్తి సామర్ధ్యాల వలన ఆ స్థాయికి చేరుకున్నాం అనుకుంటారు తప్ప అసలు దేవుడనే వాడు ఒకడున్నాడనే గుర్తుకు రాదు..!

అనుకోకుండా నిన్న డిస్కవరీలో పెంగ్విన్ ల మీద కార్యక్రమం చూశాను.. అవి సముద్రంలో ఆడుకుంటూ ఉంటాయి.. తరువాత ఒడ్డుకి వస్తూ ఉంటాయి.. అయితే ఆ బండరాళ్ళ మీద నడుస్తున్నప్పుడు, అలలు వచ్చి వాటి మీద పడడం వలన, మళ్ళీ సముద్రంలోకి జారిపోతూ ఉంటాయి.. అయినా పైకి రావడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి.. ఎట్టకేలకి అవి తమ గమ్యస్థానాన్ని చేరుకున్నాయి.. పెంగ్విన్లు సముద్రుడితో పోల్చుకుంటే చాలా చాలా చిన్నవి.. అయితే అవి తాము ఎక్కలేకపోవడానికి కారణం సముద్రుడని తిడుతూ కూర్చోలేదు వాటి ప్రయత్నం అవి చేశాయి.. నోరు లేని, ఎటువంటి తెలివి తేటలు లేని, ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని జీవులు తమ వంతు కృషి తాము చేస్తున్నాయి.. కానీ మనకి ఇన్ని అందుబాటులో ఉండి, మన తప్పులకి, కష్టాలకి వేరేవాళ్ళని బాధ్యులని చేయడం ఎంత వరకు భావ్యం…?!

ఇదంతా చెప్పడంలో నాకున్న ఒకే ఒక్క ఉద్దేశ్యం ఎదుటి వారిని వేలెత్తి చూపే ముందు, మిగతా నాలుగు వేళ్ళు మనల్నే చూపిస్తున్నాయి అని గుర్తుంచుకుంటే చాలు.. ఎంతసేపూ ఎదుటి వారిని నిందిస్తూ ఉండడం వల్ల ఒరిగేదేమీ లేదు.. కంఠశోష, అసంతృప్తి తప్ప.. అలా సమయాన్ని వృధా చేసుకునే బదులు, తామేమి చేయాలో తెలుసుకోవాలి…దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి..అంతే కానీ, మనల్ని ఇబ్బంది పెట్టినవాళ్ళని, కష్టపెట్టిన వాళ్ళని, నాశనం చేసిన వాళ్ళని పట్టించుకోకూడదు.. అన్ని జన్మలలోకీ మానవ జన్మ ఉత్కృష్ఠమైనది.. దాన్ని కేవలం కొంతమందిని తిట్టుకుంటూ గడిపెయ్యకూడదు..

జీవితంలో అన్ని రకాల వాళ్ళు ఎదురవుతూ ఉంటారు.. అందరూ మంచి వాళ్ళయి, ఎటువంటి బాధలు లేకుండా ఉంటే అసలు అది జీవితమే కాదు.. ఎవరిని ఎలా ఎదుర్కోవాలో, ఎవరితో ఎలా మసలుకోవాలో తెలుసుకోవాలి.. జీవితం నేర్పే పాఠాలని ఏ కళాశాలలోనూ నేర్చుకోలేము.. కొంత మందికి శాస్త్ర పరిశోధన చేశారని Ph.D ఇస్తుంటారు కానీ సరిగ్గా చూస్తే అందరూ తమ తమ జీవితం మీద Ph.D చేస్తూనే ఉంటారు.. అందుకే ఒక పాటలో సిరివెన్నెల గారంటారు “నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవసారం” అని.. భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది.. దాన్ని సాధించడానికి మన వంతు ప్రయతం మనం చేయాలి.. మనం చేసే ప్రతి పనికి పూర్తి బాధ్యత మనదే.. దానికి ఎవరూ కారణం కాదు.. కాబట్టి అనవసర విషయాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఆశావహ దృక్పధంతో మన పని మనం చేసుకుపోవాలి..

గమనిక: ఇది అంతా చదివిన తరువాత, ఎదుటి వారిని వేలెత్తి చూపద్దు అంటూనే, నేను ఎంతో మందిని వేలెత్తి చూపించాను..! కానీ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, జీవితంలో ఆటుపోట్లనేవి ఉంటాయి.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే మనం చేయగలిగేది…ఏ కారణం చేతనైనా, మనం మన లక్ష్యాన్ని వదులుకోకూడదు..

8 comments:

వెంకట రమణ said...

బాగా చెప్పారు.

క్రాంతి said...

మేధ గారు,
నేను ఇదే మొదటిసారి మీ బ్లాగు చూడటం.చాలా బాగా రాసారు.
తమ failures కి ఎవర్నో బాధ్యులుగా చూపించి sympathy కోరుకునే శంకర్ నాయక్ లని భలే కడిగేసారు. Keep Going.

Unknown said...

Good... baga chepparu... prati manishi ki tappakunda unde rogam "ego" or "aham". Tanu chesina tappunu nirbayanga, swachandanga oppukune manishi unte.. aa manishi jeevitanni kuda jayinchadani anadam lo elanti sankocham ledu... Meeru raasina e entry evvaru tama tappulani telusukokunda eduti valla netti paina rastuntaaru ani annaru... daaniki karanam edo ne naa abhiprayam. Eduti valla pai ruddadam valla tama aham debba tinadu kabatti ala chestuntaaru...

So, I feel... ninnu (aham in sanskrit) nuvvu jayinchu, taruvata prapancham ninnu anusaristundi :)

విహారి(KBL) said...

అమ్మో ఇంత పెద్ద టపా రాసినందుకు,మనుషుల మనస్తత్వాలని ఇంత బాగా విశ్లేసించినందుకు మీకు జోహార్లు.

Unknown said...

బావుంది మీ విశ్లేషణ.

రాధిక said...

ఈ లోకం లో ఆ శంకర్ లాంటివాళ్ళే ఎక్కువ.మన జీవీం లో ఏదో ఒక సమయం లో ఏదో ఒక సంఘటనకు ఇతరులని బాధ్యులను చేస్తూనే వుంటాము. అలా చెయ్యకపోతే బ్రతకలేమేమో? మనం ఇలా అయ్యిపోడానికి మనమే కారణమన్న నిజం జీర్ణించుకుని బ్రతుకు సాగించడం కష్టం.

మేధ said...

@రాధిక గారు: మీరు చెప్పింది నిజమే.. అందుకే నేను కూడా అదే వ్రాశాను.. అది శృతి మించనంతవరకూ బానే ఉంటుంది, వాళ్ళు జీవితంలో ఎదగడానికి తోడ్పడుతుంది..! కానీ, కొంతమంది వాళ్ళు పైకి రావడానికి ఏ ప్రయత్నము చేయకుండా, ఎదుటి వారిని మాటలు అనడమే పని గా పెట్టుకుంటారు, అలాంటి వాళ్ళ గురించి నేను వ్రాసింది..

మేధ said...

@వెంకటరమణ గారు,
@క్రాంతి గారు
@హ్యారిస్ గారు
@విహారి గారు
@ప్రవీణ్ గారు

అందరికీ నెనర్లండీ..